అమరావతి: శాసనమండలి రద్దుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్కు 19 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సోమవారం ఉదయం సీఎం జగన్ అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులందరూ మాట్లాడిన అనంతరం సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. అనంతరం శాసన మండలి రద్దు తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఓటింగ్ నిర్వహించారు. ఈ తీర్మానానికి 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా తీర్మానానికి మద్దతిచ్చారు. అయితే వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉండగా, 132 మంది మాత్రమే తీర్మానానికి అనుకూలంగా ఓటింగ్లో పాల్గొన్నారు. జనసేన ఎమ్మెల్యే రాపాక మద్దతుతో ఆ సంఖ్య 133కు పెరిగింది. అధికార పార్టీకి చెందిన 19 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉన్నారు.
ఓటింగ్ కంటే ముందే వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఓటింగ్ సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అసెంబ్లీ లాబీల్లోనే ఉండిపోయారు. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలగిరి అసెంబ్లీలో లేరు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవిలు ఎమ్మెల్సీలు కావడంతో వారికి ఓటు హక్కులేదు. శాసనమండలి రద్దు తీర్మానంపై జనసేన ఎమ్మెల్యే రాపాక సహా మొత్తం 133 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో శాసనమండలి రద్దు తీర్మానాన్ని ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేశారు.
ఓటింగ్కు దూరంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు సీఎం జగన్ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు గైర్హాజరుపై చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కోఆర్డినేషన్ చేయకపోడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వ విప్ లు అయిన చెవిరెడ్డి, దాడిశెట్టి రాజా కూడా సభలో లేకవడంతో ఈ విషయాన్ని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్కు దూరంగా ఉండటంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. జగన్ ప్రవేశపెట్టిన మండలి రద్దు తీర్మానాన్ని వ్యతిరేకించి 19 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొట్టారని ప్రచారం జరుగుతోంది. అయితే, వ్యూహాత్మకంగానే వారు సభకు రాలేదా? లేక నిర్లక్ష్యంగా వ్యవహరించారా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.