(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: అమరావతి రైతుల ఆందోళనకు తొలి సారిగా ఓ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సంఘీభావం తెలియజేశారు. మందడంలోని రైతుల దీక్షా శిబిరాన్ని శుక్రవారం నరసరావుపేట వైసిపి ఎంపి లావు కృష్ణదేవరాయలు సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంలో తను రాజధానికి అనుకూలమా కాదా చెప్పాలంటూ రైతులు డిమాండ్ చేశారు.
భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదని ఎంపి కృష్ణదేవరాయలు వారికి ధైర్యం చెప్పారు. రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనీ, ప్రభుత్వ కమిటీ వచ్చినప్పుడు అందరూ అభిప్రాయాలు తెలియజేయాలనీ ఆయన సూచించారు. రైతుల కష్టాలు, ఆందోళనను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఆందోళనలు చేస్తున్న రైతులు ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని కోరుతూ 45 రోజులుగా రైతులు, మహిళలు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి లాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన 29 గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 45రోజులుగా రైతులు, మహిళలు పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇప్పటి వరకూ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఈ శిబిరాల వైపు కన్నెత్తి చూడలేదు. వైసిపి మినహా టిడిపి, బిజెపి, జనసేన, వామపక్షాల నాయకులు రైతులకు అండగా నిలిచారు. తొలి సారిగా వైసిపికి చెందిన ఎంపి లావు కృష్ణదేవరాయలు దీక్షా శిబిరాన్ని సందర్శించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ సందర్భంగా ఆయనకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.