(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
వైసిపి ఎంపి రఘురామకృష్ణం రాజు ఈ నెల 11న ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్న భారీ విందు కార్యక్రమం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ విందు రాజకీయంలో ఏమైనా మతలబు ఉందా లేక సాధారణమైన విషయమేనా అన్న చర్చ సాగుతున్నది. ఇటీవల వైసిపిలో సంభవించిన వివిధ పరిణామాలు ఈ చర్చకు ఆస్కారం కల్పిస్తున్నాయి. వైసిపికి చెందిన ఎంపిలు ఎవరూ విజయసాయిరెడ్డి రెడ్డి లేకుండా కేంద్ర మంత్రులను, ఇతర పెద్దలను కలువకూడదని సిఎం జగన్ హుకుం జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసిపి ప్రభుత్వ పాలసీకి భిన్నంగా ఎంపి రఘురామకృష్ణంరాజు పార్లమెంట్లో మాతృభాష ఉన్నతిపై ప్రస్తావించడం కూడా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ విషయంపై రఘురామకృష్ణం రాజు వివరణ కూడా ఇచ్చారు.
మరో పక్క పలువురు టిడిపి, వైసిపి నేతలు తమ పార్టీతో టచ్లో ఉన్నారంటూ బిజెపి ఎంపి సుజనాచౌదరి, ఆ పార్టీ నాయకుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పార్లమెంట్ సెంట్రల్ హాలు వద్ద రఘురామకృష్ణం రాజును ప్రధాని మోది పేరు పెట్టి పిలిచి కరచాలనం చేయడంతో రఘురామకృష్ణం రాజు బిజెపిలో చేరనున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. రఘురామకృష్ణం రాజు స్పందిస్తూ తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సుజనా చౌదరియే వైసిపిలో చేరే అవకాశం కూడా ఉందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారాలు ఈ విధంగా ఉండగానే ఈ నెల 11న తన వియ్యంకుడు, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు నివాసంలో రఘురామకృష్ణం రాజు విందు ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా సుమారు 300మంది వరకు ఎంపిలను ఈ విందుకు రఘురామకృష్ణం రాజు ఆహ్వానించారు. ఈ విందుకు పలువురు కేంద్ర మంత్రులు హజరుకానున్నట్లు తెలిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోది, హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆత్మగా చలామణీ అయిన కెవిపి రామచంద్రరావు వైఎస్ మరణానంతరం జగన్ పక్కన చేరలేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వైఎస్కు అన్ని తానై నడిపించిన కెవిపి ఆయన తనయుడు జగన్మోహనరెడ్డికి దూరంగానే ఉంటున్నారు. అలాంటి కెవిపి నివాసంలో వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు కార్యక్రమం ఎర్పాటు చేయడంతో ఈ విందు రాజకీయంలో ఏమైనా మతలబు ఉన్నదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.