న్యూఢిల్లీ: ఏపి రాజధాని అమరావతిని మార్పు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని మార్చే యోచన ఉందని ప్రభుత్వం ఎక్కడా ఇంత వరకూ ప్రకటించలేదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అక్కడ ముంపు ఉందనేది మాత్రం నిజమని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఏ విషయంలోనైనా ముందుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాలతో కూలంకుషంగా చర్చించి వారి ఆశీస్సులతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో వేల కోట్ల రూపాయలు అవినీతి, అక్రమాలకు పాల్పడిందనీ, వాటిని పూర్తి స్థాయిలో రికవరీ చేయడానికి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు వెళుతున్నదని చెప్పారు.
పోలవరం రివర్స్ టెండరింగ్, పిపిఎల పునః పరిశీలన తదితర అంశాలలోనూ మోది, అమిత్షాలతో సిఎం జగన్ సంప్రదించే నిర్ణయం తీసుకున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.