సభలో నినాదాలు చేస్తున్న వారిని వారిస్తున్న కలెక్టర్ ఇంతియాజ్
అమరావతి: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ముస్లిం మత పెద్దలకు మైనారిటీ దినోత్సవం వేడుకల్లో ప్రాతినిధ్యం కల్పించడంపై వైసిపికి చెందిన ముస్లిం కార్యకర్తలు ముఖ్యమంత్రి జగన్ సమక్షంలోనే నిరసన వ్యక్తం చేశారు. ముస్లిం కార్యకర్తల నిరసనతో ప్రార్థన చేపట్టిన ముస్లిం మత పెద్దలను అర్ధంతరంగా వేదిక నుండి దించివేశారు.
భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం అజాద్ 132వ జయంతి వేడుకలను పురస్కరించుకొని విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్లో సోమవారం మైనారిటీ దినోత్సవం వేడుకలను ఏర్పాటు చేశారు. జాతీయ విద్యాదినోత్సవం సందర్భంగా ఎపిజె అబ్దుల్ కలాం విద్యా పురస్కార అవార్డులను సిఎం జగన్మోహనరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ముందుగా సర్వమత ప్రార్థనలకు పిలిపించిన ముస్లిం మత పెద్దలు ఖాదిర్ మౌలా, మౌలానా హుస్సేన్ వేదికపై ప్రార్థన నిర్వహిస్తుండగా పలువురు ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు.
టిడిపి గెలుపుకోసం కృషి చేసిన వారిని అధికారులు ప్రార్థనలకు ఎంపిక చేశారని స్థానిక వైసిపి మైనార్టీ నేత ఆసిఫ్ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా దృష్టికి తీసుకువెళ్లారు. అదే విధంగా ఆహ్వానపత్రికలోనూ వైసిపికి చెందిన ముస్లిం నేతల పేర్లు లేకుండా టిడిపికి చెందిన ముస్లిం నేతల పేర్లు వేశారని ఆరోపించారు. పలువురు ముస్లిం యువకులు ప్రార్థన సమయంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుండటంతో సిఎం పక్కనే వేదికపై ఉన్న కలెక్టర్ ఇంతియాజ్, ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, ఇతర అధికారులు చేతులు ఊపుతూ వారిని వారించారు. అయినా వారు నినాదాలు కొనసాగించడంతో అధికారులు ప్రార్థన చేస్తున్న ముస్లిం మతపెద్దలను అర్థంతరంగా దించివేస్తూ సర్వమత ప్రార్థనలో భాగంగా వెంటనే క్రైస్తవ మత పెద్దలతో ప్రార్థనను కొనసాగించారు.