(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వైసిపి నేత పివిఎల్ నరసింహరాజు ఏదో సందర్భంలో చేసిన సంచలన వ్యాఖ్యలు నేడు వైరల్ అయ్యాయి.
చుట్టుపక్కల నియోజకవర్గంలో పోటీ చేసిన అందరు అభ్యర్థులకు పది నుండి 18కోట్ల రూపాయలు పార్టీ నుండి వచ్చాయనీ, తాను మాత్రం ఒక్క రూపాయి కూడా పార్టీ నుండి తీసుకోలేదంటూ నరసింహరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా ఎన్నికల్లో తాను సొంత డబ్బులే ఖర్చు చేశాననీ, ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉంటూ సేవలు అందిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అసలు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని అనుకోలేదనీ, జగన్ పిలిచి టికెట్ ఇవ్వడంతో తాను వ్యాపారాలను పక్కన బెట్టి పోటీ చేశానని నరసింహరాజు చెప్పుకొచ్చారు. గత నెల చివరి వారంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడినట్లుగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే దీనిపై టిడిపి నేతలు స్పందించారు. టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ)కీ ట్యాగ్ చేశారు.
పేద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నిరుపేద వైఎస్ జగన్ మొన్న ఎన్నికల్లో ఎలా గెలిచారో ఉండి నియోజకవర్గంలో వైసిపి తరపున పోటీ చేసిన నరసింహరాజు కుండబద్దలు కొట్టేశారనీ లోకేష్ పేర్కొన్నారు. చాలా దయనీయంగా నియోజకవర్గానికి కేవలం పది నుండి 18కోట్ల రూపాయలు ఖర్చు చేశారంట కాస్త గమనించండి అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లోకేష్ విజ్ఞప్తి చేశారు.