(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
లక్నో ఉర్దూ కవితారూపమైన కవ్వాలీలకు యోగి ఆదిత్యనాధ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్లో స్థానం లేదట. ప్రముఖ కథక్ నాట్యకారిణి మంజరీ చతుర్వేది ఒక కవ్వాలీకి నాట్యం చేస్తుండగా మధ్యలో అర్ధంతరంగా ఆపివేశారు. లక్నోలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక కార్యక్రమంలో గురువారం సాయంత్రం మంజరి కథక్ నృత్యం అభినయించారు. దానికి నేపధ్యంగా వినవస్తున్న కవ్వాలీ పాట అకస్మాత్తుగా ఆగిపోయిందనీ, వెంటనే మైక్లో మరో కార్యక్రమం ప్రకటించారనీ మంజరి ఫేస్బుక్ ద్వారా ప్రకటించారు.
తాను వేదిక దిగిన తర్వాత అధికారులను ప్రశ్నించగా వారు కవ్వాలీలు ఇక్కడ పనికిరావు అని చెప్పినట్లు ఆమె తెలిపారు. కవ్వాలీ సంగీతం సూఫీ సంప్రదాయం నుంచి రూపొందింది. దానిని వస్తువుగా స్వీకరించి మంజరి సూఫీ కథక్ అనే నాట్యరీతి రూపొందించారు. ఆమె వివిధ ప్రపంచ నగరాలలో ఇప్పటికి దాదాపు 200 ప్రదర్శనలు ఇచ్చారు.
మంజరి ఆరోపణను ఉత్తరప్రదేశ్ అధికారులు ఖండించారని ఎన్డిటివి తెలిపింది. ప్రదర్శన కార్యక్రమాలు ఆలస్యంగా మొదలవడంతో మంజరి ప్రదర్శన మధ్యలో ఆపాల్సివచ్చింది తప్ప ఇతర ఉద్దేశ్యాలు లేవని వారు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యహ్నం మంజరి మరో ఫేస్బుక్ పోస్టు పెట్టారు. జనవరి 27న ఉత్తరప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం నాడు కవ్వాలీపై ప్రదర్శన ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం నుంచి వర్తమానం వచ్చిందని ఆమె తెలిపారు