చెన్నై: బలవంతంగా హిందీ భాషను దేశవ్యాప్తంగా అమలు చేయడం మంచిది కాదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. భారతదేశానికి ఒకే జాతీయ భాషగా హిందీ ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ ఆంశంపై రజనీకాంత్ స్పందించారు. బుధవారం చెన్నైలో రజనీకాంత్ మాట్లాడుతూ.. హిందీ భాష అమలు ఎక్కడైనా సాధ్యమవుతోందేమోగానీ దక్షిణాది రాష్ట్రాల్లో సాధ్యం కాదని అన్నారు. ‘ఏ భాషను కూడా బలవంతంగా రుద్దకూడదు. దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అంగీకరించవు. అంతవరకూ ఎందుకు? ఉత్తరాదిలోనే ఒకే భాష విషయంలో ఏకాభిప్రాయం దొరకదు. దేశాభివృద్ధికి ఒకే భాష మంచిదే. కానీ దురదృష్టవశాత్తూ భారత్ లో అది సాధ్యపడదు’ అని రజనీ వ్యాఖ్యానించారు.
హిందీ భాషా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఒకే భాష ఉండాలనీ, అప్పుడే దేశం ఐక్యంగా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత్కు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేలా ఒక భాష ఉండాలని.. అది అత్యధికంగా మాట్లాడే హిందీ భాష ఉండాలని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎక్కువ మంది మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో దోహదపడుతుందన్నారు. దేశమంతా హిందీని ప్రాథమిక భాషగా చేయాల్సిన అవసరం ఉందని.. యావత్ భారతదేశానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
అయితే, అమిత్ షా వ్యాఖ్యలపై దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ సహా పలు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. షా వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. తమ గుర్తింపును, భాష, సంస్కృతి పరిరక్షణ కోసం ఎందాకైనా వెళతామని హెచ్చరించారు. హింధీ భాషను బలవంతంగా రుద్దడం ఇతర భాషలపై దాడి చేయడమేనని అన్నారు. తమిళులపై హిందీని బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామని డీఎంకే అధినేత స్టాలిన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.