అమరావతి: రాజధాని అమరావతికి లాండ్ పూలింగ్లో భూములు ఇచ్చి ప్లాట్లు పొందనున్న అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు దారులకు జగన్ ప్రభుత్వం షాక్ ఇస్తోంది. ఏపికి మూడు రాజధానులంటూ సూచన ప్రాయంగా వెల్లడించిన సిఎం జగన్ తాజాగా ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజధాని నిర్మాణంలో భాగంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన అసైన్డ్ భూముల విక్రయాలు రద్దు చేస్తూ వాటిని అసలు హక్కుదారులకే తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. వారికి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లను రద్దు చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. 1977 అసైన్డ్ భూముల చట్టం ప్రకారం భూముల బదలాయింపు కుదరదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
టిడిపి హయాంలో రాజధాని ప్రాంతంలో ఇన్సైడ్ ట్రేడింగ్కు పాల్పడినట్లు వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలు, వారి బంధువులు 4,070 ఎకరాల అసైన్డ్ భూములను కొనుగోలు చేశారనీ, ఆ భూములను రాజధానిలో ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చి ప్రభుత్వం నుండి రిటర్నబుల్ ప్లాట్ల రూపంలో లబ్దిపొందేందుకు ప్రయత్నించారనీ మంత్రి బుగ్గన అసెంబ్లీలోనే పేర్కొన్నారు.