మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్ జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త ఆయుధం సమకూర్చుకోవాలన్న నిర్ణయాన్ని ఆ మధ్య ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంతో ఆమోదింపజేశారు. ఇప్పుడు తాజాగా దానికి సంబంధించిన జీవోను (జీవో ఆర్టి నంబర్ 2430) బుధవారం విడుదల చేశారు.
ఈ జీవో ప్రకారం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే వార్తాకథనాలు ఇచ్చే పత్రికలు, న్యూస్ ఛానళ్లు, సోషల్ మీడియా అవుట్లెట్లపై ఆయా శాఖల కార్యదర్శులే కోర్టులో కేసులు దాఖలు చేయవచ్చు. ఈ అధికారాన్ని సమాచార శాఖ కమిషనర్కు దఖలు పరుస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు 938 జీవో తెచ్చారు. అయితే జర్నలిస్టు సంఘాల నిరసనకు తలొగ్గి దానిని ఉపసంహరించుకుంటామని చెప్పారు కానీ ఆ పని చేయలేదు. అయితే ఇంతవరకూ ఎవరూ ఆ జీవోని వాడలేదు కూడా. ఇప్పుడు కుమారుడు జగన్ ముఖ్యమంత్రి హోదాలో దానికి కొత్త పదును కల్పించి మరో జీవో జారీ చేశారు.