నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్ చూసి విశ్లేషకులు మరియు పేరుమోసిన రాజకీయ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. జగన్ ఈ రకమైన చర్య తీసుకోవడం ఊహించినదే కాని ఈ సమయంలో తీసుకోవడం మాత్రం చాలామందికి చాలా విచిత్రంగా తోచింది. ఎందుకంటే పాలిటిక్స్ లో రైట్ టైమింగ్ చాలా ఇంపార్టెంట్.
అయితే ఎవరైనా పరిస్థితి అంతా తమకు అనుకూలంగా ఉన్నప్పుడు అవతల పార్టీలపై అటువంటి అరెస్టులు గట్రా ప్లాన్ చేస్తారు కానీ జగన్ తన పదేళ్ళ రాజకీయ అనుభవం నుండి చాలా కొత్త పద్ధతులను నేర్చుకున్నాడు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దారుణ పరిస్థితిలో ఉంది. అధికారం చేజారి ఏడాది అయినా కోలుకోలేదు. ఇన్ని రోజులు కామ్ గా ఉన్న జగన్ ఒక్కసారిగా వారిపైకి చెలరేగడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది అని వైసిపి వర్గాలు చర్చించుకుంటున్నాయి.
వివరాల్లోకి వెళితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి జగన్ కు కొద్దిగా ప్రతికూలంగా ఉంది. ముఖ్యంగా హైకోర్టు మరియు సుప్రీం కోర్టు నుండి వచ్చిన షాకుల నుండి కోలుకోవడం అధికార పార్టీకి కొంచెం ఇబ్బందికర వ్యవహారమే. అయితే టిడిపి మాత్రం కనీసం జగన్ పైన కౌంటర్లు స్థితిలో కూడా లేదు. అందుకే జగన్ ఇదే సరైన సమయమని వారిని కోలుకోలేని దెబ్బ తీసేందుకు పూనుకున్నాడు. మొన్న చేపట్టిన క్యాబినెట్ సమావేశంలో సిబిఐ విచారణకు జగన్ ఆదేశించారు. అయితే కొద్ది గంటల్లోనే అచ్చెన్నాయుడు ని ఏసీబీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం.
ఎలాగో ఇప్పుడు రాష్ట్రంలో మనకు నెగిటివిటీ ఉంది. అదేదో ప్రతిపక్షానికి షిఫ్ట్ చేసి రాష్ట్ర రాజకీయాల్లోనే తమపై ఉన్న వ్యతిరేక భావాన్ని డైవర్ట్ చేద్దామని జగన్ స్కెచ్ అని కొందరు భావిస్తున్నారు. మళ్లీ ఇప్పుడు జాప్యం చేసి చేతులు కట్టుకుని కూర్చుంటే రెండేళ్లలో టిడిపి మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇక పోతే ఇప్పటికే అధికార పార్టీకి వైసిపి సీనియర్ నాయకులు నుండి పెద్ద ఎత్తున అసమ్మతి మొదలైంది. జగన్ వారందరి గుండెల్లో గుబులు రేపేందుకైనా ఏదో ఒక కార్యం తలపెట్టాలి. అదేదో రాష్ట్రంలో తనపై ఉన్న వ్యతిరేక భావాన్ని తుడిచిపెట్టే లాగా మరియు విపక్షాన్ని కోలుకోలేని దెబ్బతీసి ఇంకా పార్టీలో ద్వంద్వ వైఖరి చూపిస్తున్న నాయకులకు ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే లాగా…. ఇలా ఒకేసారి పలు ప్రయోజనాలు జరిగేలా వైసిపి ఆపరేషన్ టిడిపి కి శ్రీకారం చుట్టింది.
దీనికి బదులుగా ఇప్పుడు మనం టిడిపి నుంచి ఏమన్నా ఫైట్ ఆశించవచ్చా అంటే కష్టమనే చెప్పాలి. అచ్చెన్నాయుడు అరెస్టుతో మొదటిరోజు తెగ గగ్గోలు పెట్టినా…. తెలుగుదేశం పార్టీ యొక్క నైతిక స్థైర్యం దెబ్బతింది అన్నది మాత్రం వాస్తవం. దానికి తగ్గట్టు ఉదయాన్నే జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు అతని కుమారుడి అరెస్ట్ తో ఎక్కడ దెబ్బకొట్టాలో అక్కడే దెబ్బకొట్టి సరైన సమయంలో వైసీపీ వార్ డిసైడ్ చేసింది. దీంతో ఇప్పుడు పూర్తిగా టిడిపి డిఫెన్స్ లో పడిపోయింది.
ఇప్పుడు ఎన్ని ప్రతికూల నిర్ణయాలు హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి వచ్చినా…. లేడా పొరపాటున కేంద్రం నుంచి వ్యతిరేకత వచ్చినా వైసీపీకి రాష్ట్రంలో ఎటువంటి అడ్డంకి ఉండదు. అదీ కాకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ వైపు చూస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీకి ఆర్థికవనరులు అన్నింటినీ వైసిపి వారు వ్యూహాత్మకంగా దూరం చేశారు. అందులో భాగమే మొన్నటి సిద్ధారెడ్డి అధికార పార్టీలో చేరిక. ఇలా అన్ని వైపుల నుండి అష్టదిగ్బంధనం చేసిన జగన్ ఆపరేషన్ టిడిపి పెద్ద సక్సెస్ అనే చెప్పాలి.