చిత్తూరు, ఏప్రిల్ 5: హామీలు అమలు చేయని నాయకుడు రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోవాలి, ఆ విధంగా రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. జగన్మోహనరెడ్డి శుక్రవారం తన ఎన్నికల ప్రచారాన్ని చిత్తూరు జిల్లాలో నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యత వహిస్తున్న కుప్పం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సభలో 2014 ఎన్నికల్లో మోసపూరిత మాటలు, హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని నాయకుడు రాజీనామా చేసి ఇంటికి పోవాలని జగన్ అన్నారు.
కుప్పం నియోజకవర్గాన్ని బిసిల నుండి చంద్రబాబు లాక్కున్నారని అన్నారు. 30ఏళ్లలో కుప్పంలో ఏం అభివృద్ధి జరిగిందని జగన్ ప్రశ్నించారు. కుప్పం ప్రజలు ఆనేక కష్టాలు పడుతున్నారని జగన్ పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసేందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో కొత్త సినిమా చూపిస్తున్నరని విమర్శించారు. చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు 14ఏళ్లు సిఎంగా ఉన్నా కుప్పం నియోజకవర్గంలో అక్షరాస్యతశాతం పెరగలేదనీ, చాలా ప్రాంతాల్లో ప్రాధమిక విద్య పూర్తి చేయని వారు ఉన్నారని జగన్ అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాలు తీర్చే పాలూరు ప్రాజెక్టు నిర్మాణానికి బాబు ముందుకు రాలేదని విమర్శించారు. కుప్పంలో కనీసం డిగ్రీ కళాశాల కూడా పెట్టలేకపోయారని దుయ్యబట్టారు. కుప్పంకు ఏదైనా మేలు జరిగిందంటే అది వైఎస్ఆర్ హయాంలోనేనని చెబుతూ గుడిపల్లె నుండే వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీని ప్రారంభించారని జగన్ గుర్తు చేశారు.
సొంత బావమరిది హరికృష్ణ చనిపోయాడన్న బాధ లేకుండా కెసిఆర్తో పొత్తు పెట్టుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించారని, ఆయన ఒప్పుకోకపోవడంతో కెసిఆర్పై విమర్శలు చేస్తున్నారని జగన్ అన్నారు. నేడు తెలంగాణను బూచిగా చూపి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు.
చంద్రబాబు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నాడని దుయ్యబట్టారు. కుప్పం నియోజకవర్గ ఎన్నికల్లో ఓడిపోతారని భయపడే గత ఎన్నికల్లోనూ, నేడు వైసిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించారని జగన్ అరోపించారు.
ఇక్కడి అభ్యర్థి చంద్రమౌళి ప్రజలు గెలిపించండి, త్వరలో ఏర్పడబోయే మన ప్రభుత్వంలో మంత్రిగా తీసుకుంటానని జగన్ హామీ ఇచ్చారు.
చంద్రబాబు మోసాలు, కుట్రలు తారా స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. ఆయన అనుకూల మీడియాతో లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చూపిస్తున్నారని జగన్ అన్నారు.
నేడు జరుగుతున్న ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధంగా జగన్ అభివర్ణించారు.
పోలింగ్కు ఇంకా ఆరు రోజులే ఉన్నాయి, ఇంకా ఏమేమి కుట్రలు బాబు చేస్తారోనని జగన్ అన్నారు. మూటలు మూటలు డబ్బుల సంచులు నియోజకవర్గాలకు పంపి ఓటుకు మూడు ఇచ్చే కార్యక్రమం చేపడతారనీ, చంద్రబాబు ఇచ్చే మూడు వేలకు
ఆశపడవద్దు అని ప్రతి ఒక్కరికి చెప్పాలని జగన్ సూచించారు.
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని ప్రతి ఒక్కరికీ చెప్పండని జగన్ విజ్ఞప్తి చేశారు.
వైసిపి నవరత్నాలతో ప్రతి ఒక్క కుటుంబానికి ప్రయోజనం కలుగుతుందని జగన్ హామీ ఇచ్చారు.