అమరావతి, మార్చి 23: వైసిపి అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. పలాస, పాడేరు, పిఠాపురం తదితర ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు. పరిశ్రమల్లోనూ 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా అసెంబ్లీలో చట్టం చేస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వ కాంట్రాక్టులను నిరుద్యోగులకే అప్పగిస్తామనీ, ఆ కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అవకాశం కల్పిస్తామని జగన్ తెలిపారు.
అధికారంలోకి రాగానే తిత్లీ బాధితులకు పరిహారంగా కొబ్బరి చెట్టుకు మూడు వేల రూపాయలు, హెక్టార్ జీడీ తోటకు 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని జగన్ అన్నారు. ‘కిడ్నీ బాధితుల సమస్యలను చూశాను. వారి గాథలను విన్నాను. కిడ్నీ వ్యాధుల రావాడానికి కారణం తాగే మంచి నీరని తెలిసి కూడా పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని చూశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలల్లోగా 200 పడకల ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేస్తాం. కాలువల ద్వారా సాగు, తాగు నీరు అందిస్తాం. గ్రామ సెక్రటరియేట్లతో 10 మందికి ఊరిలోనే ఉద్యోగాలు ఇస్తాం. గ్రామంలోని 50 ఇళ్లకు ఒక వాలింటర్ను పెడ్తాం. వారికి ఐదు వేల గౌరవ వేతనం ఇస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చే వరకు ఈ ఉద్యోగం చేయవచ్చు. ఆ గ్రామ వాలంటరీ గ్రామ సెక్రటరీయేట్తో అనుసంధానమై ప్రభుత్వ పథకాన్ని ఆ యాబై ఇళ్లకు డోర్ డెలవరీ చేస్తారు. ప్రభుత్వ పథకాల కోసం ఎవ్వరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే పరిష్కరిస్తాం. ప్రతి జిల్లాలో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా నైపుణ్యం పెంచేందుకు స్కిల్డెవలెప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం’. అని జగన్ హామీ ఇచ్చారు.
‘మన జీవితాలు బాగుపడాలంటే నవరత్నాలు ప్రతి ఇంటికి వెళ్లాలి. కానీ చంద్రబాబు పాలనలో మోసాలు, కుట్రలు, హత్యలు చూస్తున్నాం. వీళ్లే హత్యలు చేస్తారు.. వీళ్లే విచారణ చేస్తారు. వక్రీకరించడానికి వీళ్ల మీడియా ఉంది. చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పాలనపై ఎన్నికలు రావడం లేదు. హత్యారాజకీయాలతో వస్తున్నారని జగన్ విమర్శించారు.