(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొసాగుతుందా లేదా అన్న అంశంపై రాష్ట్రమంతా తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు తలకొక తీరుగా మాట్లాడుతున్నారు. దానితో విషయం మరింత గందరగోళంగా మారుతోంది. రాజధానికి భూములిచ్చిన రైతులయితే మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం రాజధాని అంశంపై సమీక్ష జరపనున్నారు. సమీక్షా సమావేశం తర్వాత రాజధాని విషయంలో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు.
రాజధాని అమరావతి కృష్ణానది ముంపు ప్రాంతంలో ఉంది కాబట్టి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని ప్రకటించి చిచ్చు రాజేసిన మునిసిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మళ్లీమళ్లీ అదే మాట అంటున్నారు. ముఖ్యమంత్రి ఆమోదం లేకుండా ఆయన అంత గట్టిగా మాట్లాడతారా అన్న అనుమానం అందరిలో ఉంది.
బొత్స మాటల తర్వాత రాజధాని అంశంపై రాజకీయాలు స్థూలంగా రెండు గ్రూపులుగా ఏర్పడ్డాయి. వైసిపి తప్ప అన్ని రాజకీయపక్షాలూ ఒక గ్రూప్గా ఉండగా రెండవ గ్రూప్లో అధికారపక్షమైన వైసిపి ఒక్కటే ఉంది. 2014లో నవ్యాంధ్ర రాజధానికి భూసేకరణ జరిపి అమరావతికి శంఖుస్థాపన జరిపిన టిడిపి సహజంగానే ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధపడుతోంది. రాజధాని తరలిపోతే భూములు ఇచ్చిన తమ గతి ఏంకావాలన్న ఆందోళనలో ఉన్న రైతులను టిడిపి ఏకం చేస్తున్నది.
మిగతా ప్రతిపక్షాలు బిజెపి, జనసేన, సిపిఐ, సిపిఎం కూడా రాజధాని మార్పు తగదనే అంటున్నాయి. రాష్ట్రంలో వీలైనంత త్వరగా బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని చూస్తున్న బిజెపి కాస్త పెద్ద గొంతుతోనే అధికారపక్షాన్ని హెచ్చరిస్తున్నది. అయితే తాము ఎదగాలంటే టిడిపి బలహీనపడాలి కాబట్టి గత ప్రభుత్వ హయాంలో రాజధానిలో చాలా అక్రమాలు జరిగాయని ఇటు కూడా విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్ రేపు జరిపే సమావేశంపైనే అందరి దృష్టీ కేంద్రీకృతం అయింది. అమరావతి భవిష్యత్తు గురించి ఇప్పటికే చాలా కథనాలు వచ్చాయి. రాజధాని ప్రకాశం జిల్లాలోని దొనకొండకు తరలిపోతుందని తనకు ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసినట్లు తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ పేర్కొన్నారు. రాజధానిలో ఉండాల్సిన సదుపాయాలను రాష్ట్రంలోని నాలుగు నగరాలలో ఏర్పాటు చేయాలన్న తన ఆలోచనను జగన్ ఢిల్లీ పెద్దలతో పంచుకున్నారని, ఇటీవలే టిడిపి నుంచి బిజెపికి ఫిరాయించిన రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ పేర్కొన్నారు. మరో బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తాజాగా అమరావతిలో రాజధాని ఉండదన్న సంకేతాలు ఇచ్చారు. ఇన్ని మాటలు వచ్చాయి కాబట్టే రాజధాని అంశంపై స్పష్టత కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులుయితే ప్రాణాలు ఉగ్గబట్టుకుని ఎదురుచూస్తున్నారు.