(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత హైకోర్టును ఆశ్రయించడం సంచలనం కల్గించింది. వివేకా హత్య జరిగి పది నెలలు కావస్తున్నా ఇంత వరకూ అసలైన దోషులను గుర్తించడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం విఫలం అయ్యింది. ఈ కేసును సిబిఐకి అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఇప్పటికే దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది.
ఇప్పటికే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, మాజీ మంత్రి ఆదినారాయణ, టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవిలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. హైకోర్టు విచారణ సందర్భంలో ప్రభుత్వ తరపు న్యాయవాది వివేకా హత్య కేసు విచారణ తుది దశలో ఉన్నందున ఈ సమయంలో సిబిఐ విచారణ అవసరం లేదని హైకోర్టుకు విన్నవించారు.
దాఖలైన అన్ని పిటిషన్లపై నేడు హైకోర్టు విచారణ జరుపనున్నది.
ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చిన్నాన్న అయిన వైఎస్ వివేకానంద రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు గత ఏడాది మార్చి 14వ తేదీన పులివెందులలోని తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు వివేకా హత్య కేసు దర్యాప్తును సిట్కు అప్పగించారు. నాడు ప్రతపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ వివేకా హత్య కేసు దర్యాప్తును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం గత ప్రభుత్వ హయాంలో నియమించిన సిట్ను రద్దు చేసి నూతన సిట్ను ఏర్పాటు చేశారు.
ఈ కేసుకు సంబంధించి ఘటనా స్థలంలో సాక్షాధారాలు మాయం చేశారన్న అభియోగంపై సిట్ అధికారులు ముగ్గురుని అరెస్టు చేశారు. అనంతరం వారు బెయిల్పై విడుదల అయ్యారు. ఈ కేసులో వివేకా బంధువులతో పాటు వందలాది మంది టిడిపి, వైసిపి నేతలు, కార్యకర్తలను సిట్ అధికారులు విచారించారు. పలువురు అనుమానితులకు నార్కొ పరీక్షలు సైతం నిర్వహించారు. అయినా దోషులను ఇంత వరకూ గుర్తించలేదు.