పొలిటికల్ మిర్రర్
మనిషిని మనిషి చంపాలంటే, చంపాలన్నంత కసి రావాలంటే డబ్బు(ఆస్తి లావాదేవీలు), సెక్స్(వివాహేతర సంబంధాలు)… ఈ రెండింటి చుట్టూనే కారణాలు తిరుగుతుంటాయి. పోలీసుల శోధన ఆ దిశలోనే ఉంటుంది. ఈ రెండు విషయాల్లో ఆచూకీ చిక్కకపోతే ఇక సీరియస్ కారణాల అన్వేషణలో పోలీసులకు చుక్కలు కనిపిస్తాయి. పది నెలల కిందట రాష్ట్రాన్ని ఆలోచింపచేసిన, ఒక జిల్లాని కుదిపేసిన, పొలీసు వ్యవస్థని ముప్పుతిప్పలు పెడుతున్న వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై నిజాలు నేటికీ వెల్లడి కావడం లేదు. రాజకీయంగా తన స్థానానికి పోటీ వస్తున్నారని ఆ బంధువు చంపించారా? క్వారీ లావాదేల్లో తనకు అడ్డు వస్తున్నారని మరో బంధువు చంపించారా? అసలు ఆ నేతను చంపాల్సిన అవసరం ఎవరికీ ఉంది? ఇది జరిగి పది నెలలు గడిచింది. ఇప్పటికీ వెనుకున్నది ఎవరు? సూత్రధారులు ఎవరు? పాత్రదారులు ఎవరు? అనే అంశాలపై స్పష్టత రావడం లేదు. వివేకా హత్య కేసులో రాజకీయం, ఆస్తి, కుటుంబ వైరి ప్రధాన భూమిక పోషించాయనేది వాస్తవం. వివేకాకు శత్రువులు ఎవరూ లేరు. ఆయన శైలి వివాదరహితం. నెమ్మదస్తుడు. రాజకీయంలో కూడా పెద్దగా ఎదగకుండా అన్న చాటున తమ్ముడిగా ఉండిపోయారు. ఎన్నికలకు నెలరోజుల ముందు దారుణ హత్యకు గురయ్యారు. అత్యంత క్రూరంగా ఫ్యాక్షన్ సినిమాల్లో చంపినట్టుగా ఆయనను కిరాతకులు నరికి చంపారు. దీనికి కారణాలే ఇప్పుడు బహిర్గతమవ్వడం లేదు. పులివెందులలో పుకార్లు తప్ప స్పష్టంగా ఏ విషయాలు తెలియరావడం లేదు. అన్నీ తెలియాలంటే వివేకా కుమార్తె సునీత అనుమానాలు నివృత్తమవ్వాలి. కేసుని సీబీఐకి అప్పగించాలంటూ ఆమె వేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది.
సునీత అడిగింది… కోర్టు ఏమంటుందో…?
వివేకా హత్య కేసుని విచారించడానికి పోలీసులు ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసారు. 10 నెలలుగా విచారణ సాగుతుంది. అనేక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికి 1400 మందిని విచారించారు. ఎటూ తేల్చడం లేదు. అందుకే ఇన్నాళ్లకు ఆయన కుమార్తె సునీత తెరపైకి వచ్చారు. పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సిబిఐ విచారణ కోరారు. ఆమె పలు అనుమానాలను వ్యక్తం చేశారు. సునీత అనుమానాలు, సగటున ప్రతి మనిషికీ వచ్చే అనుమానాలే. అవేంటో ఒక్కసారి చూద్దాం.
* నైట్ వాచ్ మెన్ రంగనకి తెలియకుండా ఇంటిలోపలికి హంతకులు ప్రవేశించే వీలుందా? ఉదయం చాల సమయం వరకు రంగన్న ఫోన్ ఎందుకు అందుబాటులో లేదు? దీనిపై పోలీసులు ఎందుకు ఇప్పటికీ పురోగతి సాధించలేదు?
* వివేకా మృతదేహంపై గాయాలు బహిర్గతమయ్యేవరకు గుండెపోటు అని ఎందుకు చెప్పారు?
* పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, గాయాలను చూసి కూడా ఉదయం 9 గంటల సమయంలో అనుమానాస్పద మృతి అని కేసు నమోదు చేసారు. శరీరంపై అన్ని రక్తపు గాయాలున్నా అనుమానాస్పద మృతి అవుతుందా?
* కేసు నమోదు చేయవద్దంటూ యెర్ర గంగిరెడ్డి ఒత్తిళ్లు ఎందుకు చేస్తున్నారు? ఇంట్లో పని చేసే లక్ష్మమ్మని ఆ రక్తపు మేరకు తుడిసివెయమని గంగిరెడ్డి ఎందుకు చెప్పారు?
* డాక్టర్ శివశంకరెడ్డి వివేకా చనిపోయిన రూమ్ కి వెళ్లి మృతదేహంపై గాయాలని మాయం చేసే ప్రయత్నం ఎందుకు చేశారు?
* సిట్ లో అధికారులని ఇప్పటి వరకు మూడు సార్లు ఎందుకు మార్చారు? డిజి స్థాయి సిట్ అధికారి నుండి ఎస్పీ స్థాయికి ఎందుకు మార్చారు?
* పోలీసులు అసలు అనుమానితుల కాల్ డేటా పరిశీలించారా?
* ప్రధాన అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి హత్య జరిగిన రోజునే ఆసుపత్రిలో ఎందుకు చేరారు? తరువాతి రోజు హరిత హోటల్ లో టిడిఫై ఎమ్మెల్సీ బిటెక్ రవిని ఎందుకు కలిశారు?
ఈ ప్రశ్నలు, అనుమానాలు వివరిస్తూ సునీత ఈ కేసుని సిబిఐ కి అప్పగించాలని హైకోర్టుని ఆశ్రయించారు. తనతో పాటూ తన భర్తకి కూడా వివేకా హత్య సూత్రధారులు నుండి ప్రాణహాని ఉందంటూ కోర్టుకి తెలియజేసారు.
జగన్ వైఖరి ఎలా ఉంది…?
వివేకా హత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశం. సునీత కోరినట్టు సిబిఐ కి అప్పగించాలి అంటే కచ్చితంగా ప్రభుత్వ వాదన ఉండాలి. హోమ్ శాఖ నుండి నివేదిక అందించాలి. ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే వివేకా భార్య సౌభాగ్యమ్మ, ముఖ్యమంత్రి జగన్, టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా సునీత వేసిన పిటిషన్ అయిదోది. అయితే కేసు విచారణ తుది దశలో ఉందని, సిబిఐ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే న్యాయస్థానానికి తెలిపింది. ఈ నేపథ్యంలో జగన్ వైఖరి ఇక్కడ కీలకంగా మారనుంది. సీబీఐకి అప్పగించాలని గతంలో ఆయనే పిటిషన్ వేయడం, ఆ అవసరం లేదు… కేసు విచారణ తుది దశలో ఉంది అని ప్రభుత్వం ఇది వరకే చెప్పడంతో కొంత గందరగోళం నెలకొంది.
తాజాగా వై ఎస్ వివేకా కుమార్తె, జగన్ సోదరి సునీత సిబిఐ దర్యాప్తును కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో జగన్ ఏ విధమైన తీసుకుంటారో చర్చినీయాంశమైంది. కోర్టులో ప్రభుత్వం చేయబోయే వాదన ద్వారా దీనిపై స్పష్టత వస్తుంది. ఈ విషయమై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేది రేపటికి తేలనుంది.
కుటుంబ సభ్యుల కీలక పాత్ర…!
వివేకా హత్య విషయంలో పరాయి వాళ్ళ కంటే కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకాకు బయట శత్రువులు ఎవరూ లేరు. సునీత ఇచ్చిన 14 అనుమానితుల పేర్లులోను 10 మంది వైఎస్ బంధువర్గం, కుటుంబ సభ్యులే ఉన్నారు. పులివెందులలో జరుగుతున్నప్రచారం, ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లు చూసినా ప్రజాప్రతినిధుల పాత్ర స్పష్టంగా ఉందని వెల్లడవుతుంది. పులివెందులలో ప్రస్తుతం వైఎస్ కుటుంబాలన్నీఒకే పార్టీలో ఉంటున్నప్పటికీ… వారికి పూర్వం నుండి చిన్నపాటి తగాదాలున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాత వెంకటరెడ్డి(రాజారెడ్డి తండ్రి)కి ఇద్దరు భార్యలు, 11 మంది సంతానం. అలా వైఎస్ కుటుంబంలో నాటి నుండీ బయటకు పొక్కని విభేదాలుండేవి. ఈ కేసులో లోతుగా విచారిస్తే వైఎస్ కుటుంబంలోని ఓ కీలక ప్రజా ప్రతినిధి పాత్ర బయట పడుతుందని ప్రచారంలో ఉంది. ఎన్నికలకు ముందు తన స్థానానికి రాజకీయంగా పోటీ వస్తారని, రాజారెడ్డి కుటుంబంలో జగన్ ని ఒంటరి చేయాలని ప్రణాళిక ప్రకారం ఈ హత్య చేసి ఉంటారని పులివెందులలో చర్చించుకుంటున్నారు. ఇదే క్రమంలో వివేకా గత కొన్నేళ్లుగా ఓ గనుల క్వారీలో వివాదంపై పోరాడుతున్నారు. లీజు వివాదాన్ని సెటిల్ చేసే పనిలో ఉన్నారు. ఈ వివాదంలోనూ ఆయనను హత్య చేసి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తుంది. పోలీసులు లోతుగా వెళ్లినా, సిబిఐ కి అప్పగించినా వైఎస్ కుటుంబంలోని కొందరు జైలుకి వెళ్లడం ఖాయమని చర్చ నడుస్తుంది. మొత్తానికి వైఎస్ కుటుంబంలోని ఒక నాయకుడి హత్య కేసు అదే కుటుంబంలోని వ్యక్తులను చుడుతోంది. దీనిలో నిజానిజాలు తేలిన తర్వాత కచ్చితంగా రాష్ట్రంలో సంచలన అంశంగా మారుతుంది.
శ్రీనివాస్ మానెం