కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి మూడు నెలలు గడచినా పోలీసులు ఇంత వరకూ దోషులను గుర్తించలేదు. 90 రోజులయినా ఛార్జిషీటు దాఖలు చేయలేదన్న కారణంగా ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరైంది. హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారనే అభియోగంపై అరెస్టు అయిన ఎర్ర గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్కు పులివెందుల కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై ఈ ముగ్గురిని అరెస్టు చేసి 90రోజులు పూర్తి కావడంతో న్యాయస్థానం వీరికి బెయిల్ మంజూరు చేసింది. దాదాపు మూడు నెలలైనా ఈ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయలేదు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వివేకానంద రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. తొలుత గుండెపోటుతో మృతి చెందాడని ప్రచారం జరిగినప్పటికీ తరువాత అయన వంటిపై తీవ్రమైన గాయాలు ఉండటంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తునకు అప్పటి ప్రభుత్వం సిట్ను నియమించింది. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై వివేకా కుటుంబంతో సన్నిహితంగా ఉండే గంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్లను అరెస్టు చేశారు. వివేకా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అనుమానితులనూ పోలీసులు విచారణ జరిపినా దోషులను ఇంతవరకూ నిర్ధారించలేక పోయారు.
హత్య కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదనీ, పోలీసు దర్యాప్తుపై తమను బాధించేలా మీడియాలో కథనాలు వస్తున్నాయనీ, టిడిపి ఎన్నికల ప్రచారంలో తమ కుటుంబంపైనే ఆరోపణలు చేస్తున్నారంటూ వివేకా కుమార్తె డాక్టర్ సునీత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు నాడు డిజిపి, గవర్నర్, సిఇఒ, ఎన్నికల సంఘం, కేంద్ర హోంశాఖలను సైతం కలిసి వినతి పత్రాలను సమర్పించారు. ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో కోర్టుకే అందజేయాలనీ, మీడియాకు వెల్లడించకూడనీ, రాజకీయ పార్టీలు కూడా హత్య కేసు గురించి ఎన్నికల ప్రచారంలో మాట్లాడకూడదని హైకోర్టు ఆంక్షలు విధించింది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం నియమించిన సిట్ను రద్దు చేసింది. జిల్లా ఎస్పితో పాటు డిఎస్పి ఇతర అధికారులను బదిలీ చేసి నూతనంగా సిట్ ఏర్పాటు చేశారు.