విజయవాడ: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం విజయవాడలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి మధురానగర్ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, పార్థసారథి, సామినేని ఉదయభాను, ఎంపీ గౌతం రెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, మూడు రాజధానులను స్వాగతిస్తున్నామని మహిళలు నినదించారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ అమరావతికి ఎలాంటి అన్యాయం జరగదని, తప్పుడు నివేదికలు ఇచ్చే సంస్కృతి చంద్రబాబుకే ఉందని విమర్శించారు. ప్రజలంతా పాలనావికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారని తెలిపారు. రెచ్చగొట్టాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ప్రజలు నమ్మడంలేదన్నారు. చలో అసెంబ్లీలో పాల్గొనేందుకు ప్రజలెవరూ సిద్ధంగా లేరన్నారు. సీఎం జగన్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. రైతులను చంద్రబాబు ఏవిధంగా మోసం చేస్తున్నారో.. ప్రజలు త్వరలో తెలుసుకుంటారని పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలను అరికట్టేందుకే ఈ ర్యాలీ చేపట్టామని తెలిపారు. ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు వేలాది మంది ప్రజలు, మహిళలు రోడ్ల మీదకు వచ్చారని పేర్కొన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్తో చంద్రబాబు అండ్ గ్యాంగ్ భూముల్ని కొట్టేశారని వెల్లంపల్లి ఆరోపించారు.
ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ చంద్రబాబు రాయకీయ భిక్షగాడని, మూడు ప్రాంతాల అభివృద్ధే తమ ధ్యేయమన్నారు. ఐదేళ్ల పాలనా కాలంలో దుర్గా వారధిని కట్టని అసమర్థుడు చంద్రబాబు అని విమర్శించారు. బాబు ట్రాప్లో పడొద్దని, అమరావతిలో బాబు చేసిందేమీ లేదని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. సుజనాచౌదరి వంటి బ్రోకర్ల మాటలు నమ్మొద్దని కోరారు. విజయవాడ సమగ్రాభివృద్ధే సీఎం వైఎస్ జగన్ ధ్యేయమని, లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడలోనే ఉందని గుర్తు చేశారు.