విశాఖ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ బీచ్లో ఏర్పాటు చేసిన ఒక ఫ్లెక్సీ సంచలన వార్త అయ్యింది. ఒక జాతీయ స్థాయి క్రీడాకారిణి ఫోటో కింద మరో క్రీడాకారిణి పేరుతో తప్పుగా ముద్రించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది.
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం గురువారం జాతీయ, అంతర్జాతీయ స్థాయి పతకాలు సాధించిన క్రీడాకారులకు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాలు పేరుతో బహుమతులు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ సొంత జిల్లా కేంద్రం విశాఖలో ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాటు చేశారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల ఫోటోలతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే టెన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఫోటో ముద్రించి దాని కింద పేరును పరుగుల రాణి పిటి ఉష పేరు రాశారు. దానికి తోడు ఆ ఫ్లెక్సీపై పద్మ భూషణ్, పద్మశ్రీ, అర్జున్ అవార్డు గ్రహీత అంటూ కూడ రాశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో ప్రభుత్వంపై, శ్యాప్పై విమర్శలు సంధిస్తున్నారు. దీనిపై వెంటనే స్పందించిన క్రీడాశాఖాధికారులు విశాఖ బీచ్లో తప్పుడుగా ముద్రించిన ఫ్లెక్సీలను గుర్తించి వాటిని తొలగించారు.