అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మళ్లీ విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఫ్లైఓవర్ పక్కన పార్క్లో ప్రతిష్టించేందుకు రంగం సిద్ధం అయింది. పోలీసు కంట్రోల్ రూం సమీపంలో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నేతృత్వంలో గతంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
కృష్ణా పుష్కరాల సమయంలో ట్రాఫిక్కు అడ్డంకిగా ఉందన్న కారణంతో టిడిపి ప్రభుత్వం దానిని తొలగించింది. ఆ విగ్రహాన్ని కంట్రోల్ రూం సమీపంలోని ఫైర్ స్టేషన్ వద్ద భద్రపర్చారు
మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారయణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, జోగి రమేష్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వేంకటేష్ తదితరులు శనివారం బందరు రోడ్డు లోని పోలీసు కంట్రోల్ రూం, చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. విజయవాడ నగర ప్రజలు, వైఎస్ఆర్ అభిమానుల కోరిక మేరకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని పోలీసు కంట్రోల్ రూం దగ్గర దానిని తొలగించిన ప్రాంతంలోనే పునఃప్రతిష్ఠ చేయడం కోసం పరిశీలనకు వచ్చినట్లు వారు తెలిపారు.