అమరావతి: ఈ నెల ఏడవ తేదీ వైసిపి శాసనసభా పక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిర్ణయించుకున్నారు. తాడేపల్లిల్లోని సిఎం క్యాంప్ కార్యాలయంలో ఏడవ తేదీ ఉదయం 10గంటలకు వైసిపి శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సమాచారం ఇచ్చారు. మొదటి సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహనరెడ్డిని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం తెలిసిందే.
ఈ నెల ఎనిమిదవ తేదీ ఉదయం ఉదయం 8.39గంటల మూహుర్తానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. అదే రోజు 11.39గంటలకు మంత్రివర్గ విస్తరణతో పాటు తొలి మంత్రివర్గ సమావేశం జరపాలని నిర్ణయించుకున్నారు. ఈ తరుణంలో ఒక్క రోజు ముందు శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత నెల 31వ తేదీన జగన్మోహనరెడ్డి ఒక్కరే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశం కల్పించాలన్న విషయంపై ఇప్పటికే జగన్మోహనరెడ్డి ఒక అవగాహనకు వచ్చారని సమాచారం. జిల్లాకు ఇద్దరు చొప్పున మొత్తం 25 లేదా 26మందితో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. సీనియారిటీ, కుల సమీకరణాలు తదితర అంశాల ప్రాతిపదికపై మంత్రులను ఎంపిక చేయనున్నారని అంటున్నారు. మంత్రివర్గ కూర్పులో అవకాశం దక్కని వారు నిరుత్సాహపడకుండా ఉండేందుకు వివిధ కార్పొరేషన్ల పదవులు, ఇతర నామినేటెడ్ పదవులు లభించే అవకాశం ఉందని సర్దిచెప్పే అవకాశం కూడా ఉందని అందుకే మంత్రివర్గ సమావేశానికి ఒక్క రోజు ముందుగా ఈ సమావేశం ఏర్పాటు చేశారని అనుకుంటున్నారు. 15వ తేదీ నుండి లేదా తరువాత నిర్వహించే శాసనసభ సమావేశాల్లో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై కూడా చర్చించి దిశానిర్దేశం చేయనున్నారని సమాచారం.