ఎన్నికల ముందు జంప్ జిలానీలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దూకడం సహజమే. సొంత పార్టీలో అవకాశం లేదనుకున్న వారు అవతలి పార్టీకి వెళ్లడం ఎప్పుడూ జరిగేదే. ఈసారి ఎన్నికల ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతున్నది. అయితే కాస్త ఎక్కువ స్థాయిలో జరుగుతున్నది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో జరుగుతున్నది.
టిడిపిని పరాజయం పాలు చేసేందుకు మోదీ, కెసిఆర్, జగన్ కలిసి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారం నిలుపుకోవడం కోసం సంక్షేమ పధకాల మీద ఆధారపడుతున్నారు. దానితో సరిపెట్టుకుంటే కుదరదు కాబట్టి తాను గెలుపు గుర్రాలనుకున్న వారినే రంగంలోకి దించుతున్నారు. దానికి తోడు వైసిపి నుంచి వచ్చి చేరిన వారికి కొన్ని చోట్ల అవకాశం ఇవ్వాల్సి వస్తోంది. ఫలితంగా టిడిపిలో నిరాశకు గురయిన వారు వైసిపిలోకి వెళుతున్నారు.
వైసిపిలోకి వెళుతున్న వారు ఈ ఒక్క కారణంతోనే అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. టిడిపిలో అవకాశం ఉండి కూడా కొందరు వైసిపిలోకి వెళుతున్నారు. ఇందుకు ఉదాహరణ చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్. తాజాగా నెల్లూరు జిల్లాలో ఆదాల ప్రభాకర రెడ్డికి టిడిపి టికట్ ప్రకటించిన తర్వాత కూడా వైసిపిలోకి వెళ్లారు.
వైసిపికి వలస వెళ్లేందుకు వారిని ప్రేరేపించిన అంశం ఏమిటన్నది ఆసక్తికరమైన ప్రశ్న. అధికారంలోకి రాబోయేది వైసిపియేనని వారు నమ్ముతున్నారా? వైసిపి క్యాంపులో మాత్రం ఈసారి తమ విజయం తధ్యమనే భావన బలంగా ఉంది. వారు చేయించుకున్న సర్వేలు కూడా దానినే బలపరుస్తున్నాయంటున్నారు.
కారణాలు ఏమిటన్నది ఖచ్చితంగా చెప్పలేం కానీ దేశ రాజధానిలో కూడా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితం వైసిపిని అధికారపీఠం ఎక్కిస్తుందన్న భావన గట్టిగా ఉంది. ఆ భావన దానంతట అదే వచ్చిందా, లేక ప్రశాంత్ కిషోర్ లాంటి ఎన్నికల స్పెషలిస్టులు సృష్టించారా అన్నది తెలియదు. ఈ డిజిటల్ యుగంలో ఏదైనా సృష్టించవచ్చని ట్రంప్ ఎన్నికల దగ్గర నుంచి రుజువవుతూనే ఉంది.
నిజానికి వైఎస్ జగన్కు ఈ ఎన్నికలు చాలా కీలకం. ఒక ప్రాంతీయ పార్టీ స్థాపించిన తర్వాత మొదటి ఎన్నికలలో పరాజయం పాలయితే దాని మనుగడ చాలా కష్టం. కానీ 2014 తర్వాత వైసిపికి ఆ సమస్య ఎదురుకాలేదు. కారణం రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ మట్టికరిచిపోవడం. ప్రతిపక్షం చోటును వైసిపి భర్తీ చేసింది. 2019 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఉనికి కనబడే అవకాశం లేదు కానీ, ఆ తర్వాత పరిస్థితి మారే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వైఎస్ జగన్కు ఈ ఎన్నికలు కీలకం అనుకోవడంలో తప్పు లేదు.
2014 ఎన్నికల తర్వాత టిడిపి చాలామంది వైసిపి శాసనసభ్యులకు గాలం వేసింది. భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఆదినారాయణ రెడ్డి లాంటి ఫిరాయింపు శాసనసభ్యుడికి మంత్రి పదవి ఇచ్చింది. అధికారపక్షం దూకుడును, వ్యూహాలను కాచుకుంటూ జగన్ గత అయిదేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ రాగలిగారు. ఈ ఎన్నికలలో టిడిపికి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. దీనిని చిన్న విషయం కింద తీసేయడానికి వీలు లేదు. వైసిపికి విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయన్న భావన బహుశా అందులోంచే పుట్టిందేమో!