అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్ కన్న.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని తెలిపారు. సోమవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఏపీ అసెంబ్లీ అమరావతిలో ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం…తమ అదృష్టమని అమరావతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని అన్నారు. అమరావతి రైతులు కోరుకుంటే వారి భూములు తిరిగి ఇవ్వాలన్నారు. అమరావతిని అగ్రికల్చర్ జోన్గా అభివృద్ధి చేయాలని కోరారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఖర్చు చేసిన దానికి రూ.700 కోట్లు వడ్డీ ప్రభుత్వం కడుతోందన్నారు. అమరావతిలోనే పెట్టుబడి అంతా పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితేంటని ప్రశ్నించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలు అన్ని రంగాల్లో ముందున్నాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
‘మంగళగిరి ఎమ్మెల్యే అయిన నేను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన అధికార – అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను పూర్తిగా సమర్ధిస్తున్నా. ఈ మూడు రాజధానులతో నాకు రాజకీయ భవిష్యత్ ఉన్నా, లేకపోయినా నేను జగన్ వెంట నడుస్తా. రాజకీయాల్లో ఉంటే జగన్ వెంటే ఉంటా. రాజకీయాల్లో లేకపోతే నా పొలంలో ఉంటా.’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.