(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఢిల్లీలో ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఇచ్చిన విందుపై తాను ఎవరికీ వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాత్రి ఢిల్లీలో ఎంపీలకు ఇచ్చిన విందు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విందు ఏర్పాటుపై రఘురామ కృష్ణంరాజు పార్టీ అధినాయకత్వానికి చెప్పారా ? లేదా ? అన్న చర్చ జరిగింది. దీనిపై స్పందించిన రఘురామ కృష్ణంరాజు.. ఎంపీగా తాను ఎన్నో పార్టీలకు హాజరవుతుంటానని, అప్పుడెవరి పర్మిషనూ తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు కూడా విందు గురించి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని తెగేసి చెప్పారు. విందు కోసం ముందుగా తమ పార్టీ సభ్యులనే ఆహ్వానించానని, ఆ తర్వాతే మిగతా వారికి చెప్పానని తెలిపారు. బడా నేతలతో సఖ్యత పెంచుకోవాలనుకుంటే కనుక వారిని సీక్రెట్గా పిలిచేవాడినని, ఇలా అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తానని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా ఈ విందు ఇచ్చినట్టు ఆయన చెప్పారు.
ఇదిఇలా ఉంటే..రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన విందు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఎంపీలందరికీ ఆయన బుధవారం రాత్రి ప్రత్యేకంగా విందు ఇచ్చారు. తొలుత రఘురామకృష్ణంరాజు వియ్యంకుడు, కాంగ్రెస్ ఎంపీ కె.వి.పి.రామచంద్రరావు ఇంట్లో విందు ఉంటుందని చెప్పినా, కేంద్ర మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉండటంతో వెస్ట్రన్ కోర్టుకు ఆతిథ్య స్థలాన్ని మార్చారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన సహచర ఎంపీలకు ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా కీలక పార్టీల ఎంపీలు హాజరయ్యారు. వైసీపీ నుంచి మిథున్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు ఈ విందులో పాల్గొన్నారు. ఈ విందులో ఆంధ్ర వంటకాలను ఎంపీలకు రాజు గారు రుచి చూపించారు.