హైదరాబాద్: డేటా చోరీ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని వైసిపి కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సంబంధించిన డేటాను టిడిపి,చంద్రబాబు కలసి దొంగిలించారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఆడపిల్లలకు సంబంధించిన సమాచారం టిడిపి గుండాల దగ్గర ఉందని మండిపడ్డారు. మహిళల ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నంబర్లు తదితర వివరాలు దొంగల ముఠా వద్ద ఉన్నాయని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇ-ప్రగతి పోర్టల్ ను ఆధార్ కు లింక్ చేయడం ద్వారా ఎంతో సమాచారాన్ని రాబట్టారని విజయసాయిరెడ్డి తెలిపారు. జె.సత్యనారాయణ 2106లో ఆధార్ సంస్థ చైర్మన్ గా నియమితులైనప్పటి నుంచి ఎన్నికల వరకు కూడా ఈ తంతు నిరాటంకంగా కొనసాగిందని ఆయన ఆరోపించారు. ఇ-ప్రగతి నుంచి సేవామిత్రకు డేటా బదిలీ చేశారని విజయసాయి రెడ్డి చెప్పారు.
ఆరు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన వివరాలు, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వివరాలను చంద్రబాబు తన పార్టీ యాప్ లో పెట్టుకోవడం అందరూ గమనించాలని విజయసాయి రెడ్డి అన్నారు. దీనిపై విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సేవామిత్రను రూపొందించింది ఐటీ గ్రిడ్స్ అనీ, దీని యజమాని అశోక్ దాకవరంను పట్టుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ విజయసాయి రెడ్డి తెలిపారు.
అశోక్ సేకరించిన సమాచారం ద్వారా ఎవరు ఎక్కడెక్కెడ ఉన్నారో ట్రాక్ చేసే అవకాశం ఉందని, బంధువుల స్నేహితుల ఫోన్ నెంబర్లు సేవామిత్రకు వెళ్తాయని ,ఫోన్ స్టోరేజి డేటా కూడా వారి వద్దకు వెళ్లి పోతుందని విజయసాయి రెడ్డి తెలిపారు. ఫోన్ లో ఉన్న మైక్ ను కూడా తమ అదుపులోకి తీసుకుని ఇతరుల సంభాషణను రికార్డు చేసే వీలుందని వివరించారు.ఈ విధంగా చంద్రబాబునాయుడు ఐటీ గ్రిడ్స్ అశోక్ తో కలిసి దేశానికి, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఎంత ముప్పు తీసుకువచ్చాడో అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. మహిళలకు అభద్రతా భావం కలిపించారని ఆయన పేర్కొన్నారు.
‘సేవామిత్ర యాప్తోనే టిడిపి ఎన్నికల్లో సర్వేలు నిర్వహించింది. ఈ సర్వేల్లో ఎవరైతే టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారో.. వారి ఓట్లను తొలగించేందకు ఫామ్-7 దరఖాస్తులు చేశారు. ఐటీ మంత్రి నారా లోకేశ్ ద్వారానే ఐటీ గ్రిడ్కు ప్రజల వ్యక్తిగత డేటా చేరింది. చంద్రబాబు, లోకేశ్లు అశోక్ అరెస్ట్ కాకుండా కాపాడుతున్నారు. అశోక్ ఏ తప్పు చేయకుంటే అజ్ఞాతంలోకి ఎందుకు వెళతారు?. టిడిపి ప్రభుత్వంఐపిఎస్ అధికారి బాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సిట్ను ఏర్పాటు చేసింది’ అని విజయసాయి రెడ్డి తెలిపారు. సిట్ దర్యాప్తు ఏమైంది అని ఆయన ప్రశ్నించారు.
బాలసుబ్రమణ్యం సతీమణికి గ్రీన్ ఆర్క్ సొల్యూషన్ ,ఓటిఎస్ ఐ అనే రెండు సంస్థలు ఉన్నాయనీ, ఈ సంస్థలకు ఆర్టీఏ వెబ్సైట్ సాంకేతిక బాధ్యతలను అప్పగించారనీ విజయసాయి రెడ్డి తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం రవాణాశాఖ కమిషనర్గా ఉండటం వల్లనే ఆ రెండు కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. 138 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభయ యాప్ పైలెట్ ప్రాజెక్టును తీసుకొచ్చారని, దీనికి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, ఎన్ని అత్యాచారాలు ఆపగలిగారో తెలపాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.
అశోక్ ఎక్కడ ఉన్నాడనేది చంద్రబాబు,లోకేష్ ,ఏబి వెంకటేశ్వరరావు,బాలసుబ్రమణ్యంలకు తెలుసని విజయసాయి రెడ్డి అన్నారు. ఇటీవల అశోక్ పలువురు హ్యాకర్లతో ఢిల్లీలో సమావేశమై.. కౌంటింగ్ రోజు ఎలా హ్యాక్ చేస్తే టీడీపీ అనుకూలంగా ఫలితాలు రాబట్టవచ్చనే అంశం మాట్లాడినట్టు తెలిసిందని ఆయన పేర్కొన్నారు.