చంద్రగిరి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్వగ్రామం అయిన చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నారావారిపల్లె వద్ద వైసీపీ సభ నిర్వహించనుంది. ఈ సభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు మంత్రులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. అయితే, చంద్రబాబు స్వగ్రామంలో సభ ఏర్పాటు చేయడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. వైసీపీ సభ, నిరసన కార్యక్రమాలతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వ రాజధాని తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ కూడా సభ నిర్వహించబోతోంది. నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సభ నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసుకుంటోంది.