బ్యాకింగ్ రంగంలో కీలక మార్పులు దిశగా అడుగులు వేస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకోవడానికి సన్నద్దమవుతుంది. ఎవరి ఖాతాలోనైనా డబ్బు జమ చేయాలంటే ఆ సంబంధిత ఖాతాదారుని అనుమతి సైతం తీసుకొనే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన విధివిధానాలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్బీఐకి లేఖ రాసినట్లు తెలిసింది.
నోట్ల రద్దు సమయంలో అనేక మంది ఖాతాల్లో అక్రమంగా నగదు చేరినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లధనంపై నియత్రణ విధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం దిశగా అలోచిస్తున్నట్లు తెలుస్తొంది.
ఈ విధానంలో ఎవరైనా ఏదైనా ఖాతాలో డబ్బులు జమ చేయాలంటే ముందు సదరు ఖాతాదారుడికి నోటిఫై చేస్తారు. వారు అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ డబ్బులు డిపాజిట్ అవుతాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నల్ల ధనాన్ని చట్టబద్ధంగా మార్చుకోవడానికి కొందరు జన్ ధన్ ఖాతాలను వాడుకున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి చర్యలను అరికట్టడానికే కొత్త విధానం అమలులోకి రానుంది. . ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలోనే వెల్లడించారు. “ఖాతాదారుడికి తన ఖాతాపై ప్రస్తుతం ఉన్న విధానాలపై మార్పులు తీసుకురాబోతున్నాం”. ఆ ప్రసంగంలో పేర్కొన్నారు
ఈ విధానాన్ని ముందుగా కొన్ని ప్రభుత్వరంగ బ్యాంక్లలో ప్రవేశపెట్టి తర్వాత మిగితా బ్యాంక్లకు విస్తరించే అవకాశం ఉంది. ఈ సేవల్ని పొందడానికి బ్యాంకులకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందని సమాచారం. ఖాతాదారుడికి తన అకౌంట్కి సంబంధించిన డిపాజిట్లపై ఎటువంటి నియంత్రణ లేదు. కేవలం ఖాతా నెంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఉంటే నగదు జమ చేయవచ్చు. ఈ విధానమే అక్రమదారులకు అవకాశంగా మారింది. దీంతో కఠిన చర్యలకు దిశగా కేంద్రం అలోచిస్తున్నాయి.