యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో భారతదేశపు మొట్టమొదటి ఇండియా సూపర్ స్టార్ అయిన తర్వాత అతని రేంజ్ మారిపోయింది. ఏ సినిమా తీసినా… దేశంలోని అన్ని ఇండస్ట్రీ లను దృష్టిలో పెట్టుకొని తీస్తున్నాడు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ ఆ సినిమా అయిపోయిన వెంటనే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో మరొక సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయిక కాగా ఆ సినిమా తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను టీ సిరీస్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రభాస్ లాంటి కటౌట్ ఈ సినిమాలో శ్రీరాముడిలా కనిపిస్తాడు అన్న వార్తలు బయటకు వచ్చాయి. ఇక ఈ సినిమాలో ఇంకా మిగిలిన తారాగణం ఎవరెవరు అన్న విషయాలపై ఆసక్తికర చర్చలు కూడా మొదలైపోయాయి. ప్రభాస్ పక్కన సీత పాత్రలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తిసురేష్ నటిస్తోందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. ప్రభాస్ వంటి డైనమిక్ పర్సనాలిటీ ఎదురుగా ఉండే విలన్ ఎవరు అనే విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు అన్న ప్రచారం జరుగుతోంది. సైఫ్ రావణుడి పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు. అయితే ఈ సినిమా గురించి చిత్ర యూనిట్ నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. గతంలో తెరకెక్కించిన ఓం రౌత్ తెరకెక్కించిన ‘తన్హాజీ’ సినిమాలో సైఫ్ నటించాడు. ఈ చిత్రం 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా…. ఐదు భాషల్లో కూడా దీనిని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.