తెలుగు సినీ పరిశ్రమను ఇంకా కరోనా వణికిస్తూనే ఉంది. దేశంలో, రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో సినీ షూటింగ్ లు జరుగుతున్నాయి. అయితే షూటింగ్ సందర్భంలో ముందుగా చిత్ర నిర్మాణంలో పాల్గొనే నటీనటులు, సాంకేతిక సిబ్బంది విధిగా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. చిత్ర బృందంలో ఎవరికైనా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే షూటింగ్ లను సైతం వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల అన్నాత్తై సినీ షూటింగ్ సందర్భంగా చిత్ర నిర్మాణంలోని నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవ్వడంతో షూటింగ్ నిలిచిపోయింది.
అంతకు ముందు మెగాస్టార్ చిరంజీవికి కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడంతో షూటింగ్ కార్యక్రమాలను క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే మూడు రోజుల తరువాత కూడా చిరంజీవికి ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకోవడంతో కరోనా నెగిటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో కరోనా టెస్ట్ రిపోర్టులను పూర్తి స్థాయిలో నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. ఒకటికి రెండు సార్లు పరీక్షలు చేయించుకున్న తరువాతే దృవీకరణకు రావాల్సి వస్తోంది. ఆ విషయాలు ఎలా ఉన్నా ఇప్పటికే సినీ ప్రముఖులు చాలా మంది కరోనా బారిన పడి కోలుకున్నారు.
తాజాగా మెగా ఫ్యామిలీలో హీరోలు ఈ వైరస్ బారిన పడటం అభిమానులను కలవరపరుస్తోంది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు నేటి ఉదయం రామ్ చరణ్ ప్రకటించారు. అయితే తనలో ఎటువంటి లక్షణాలు లేవన్నారు. ప్రస్తుతం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే కొలుకుని తిరిగి మీ ముందుకు వస్తానని రామ్ చరణ్ అశాభావం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని చరణ్ విజ్ఞప్తి చేశారు. ఈ షాక్ నుండి మెగా అబిమానులు కోలుకోకముందే మరో ఆందోళనకరమైన వార్త వెల్లడైంది. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. తనలో కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇంటి వద్ద స్వీయ నిర్బంధంలో ఉన్నాననీ, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నానని తెలిపారు. త్వరలోనే కరోనా నుండి కోలుకుంటానని పేర్కొన్నారు. మీ ప్రేమకు ధన్యవాదాలు అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.