AP High Court: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నుండి వ్యతిరేక తీర్పులు రావడం, షాక్ ల మీద షాక్ లు రావడం సాధారణం అయిపోయింది. ప్రభుత్వం వాటిని పరువుతక్కువగా భావించడం లేదు. అదే విధంగా తాము తప్పు చేస్తున్నామన్న భావన కూడా కలగడం లేదు. హైకోర్టు ఇస్తున్న తీర్పులను స్వీయ సమీక్ష చేసుకుని మంచి మార్గంలో పయనించే పనీ చేయడం లేదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఏపి హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూనే ఉంది. సుప్రీం కోర్టు నుండి కూడా కొన్ని వ్యతిరేక తీర్పులు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. ఈ రోజు కూడా రెండు వ్యతిరేక తీర్పులు వచ్చాయి.
సంఘం డెయిరీని స్వాధీనం చేసుకుని ఏదో ఉద్దరిస్తామని ప్రభుత్వం ఓ జీవో ఇచ్చింది. అయితే దాన్ని హైకోర్టు నిలిపివేసింది. సంఘం డెయిరీ రైతులు అందరూ ఏర్పాటు చేసుకున్న సంస్థ దానిలో మీ ప్రమేయం ఏమి ఉంది, అంతగా డెయిరీని బాగు చేయాలంటే కొంత నిధులు ఇచ్చి కాపాడండి, రైతులకు రుణాలు ఇవ్వండి తప్ప ఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా ఉన్న డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ ప్రభుత్వం సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్ కు రిట్ అప్పీల్ చేయగా నేడు ధర్మాసనం తిరస్కరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్ధించింది. దానితో పాటు మరో వ్యతిరేక తీర్పు వచ్చింది. ఇది రాజధాని అమరావతికి సంబంధించింది కావడంతో రాష్ట్రంలో ఒక సంచలన అంశంగా మారింది.
మూడు రాజధానుల విషయంలో కీలకమైన పిటీషన్లు హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. నవంబర్ 15 తరువాత రోజు వారి విచారణ ప్రారంభిస్తామని ఏపి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అసైన్డ్ భూముల రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కు తీసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వం కొన్ని నెలల కిందట జీవో నెం 316 తీసుకువచ్చింది. ఇది అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. రాజధాని నిర్మాణంలో భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం ప్యాకేజీలో భాగంగా ప్లాట్లను కేటాయించారు, అదే విధంగా అసైన్డ్ భూముల రైతులకు ప్రభుత్వం ప్యాకేజీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వాటిని రద్దు చేస్తూ నాలుగైదు నెలల క్రితం జివో 316 తీసుకువచ్చింది. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. రాజధానికి భూములు ఇచ్చినందుకు గత ప్రభుత్వం తమకు ప్లాట్లు ఇచ్చింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్లాట్ లను వెనక్కు తీసుకుంటామంటుంది. దీని కరెక్టు కాదు దీనిపై హైకోర్టే తమకు న్యాయం చేయాలంటూ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ల పై అన్ని రకాలుగా విచారణ జరిపిన కోర్టు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇది తుది తీర్పు కాదు. ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే ఈ రోజు ఏమి చేసింది అంటి జివో 316 తదుపరి ఉత్తర్వులను నిలుపుదల చేసింది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని, యదాతథ స్థితిలో వాటిని ఉంచాలని కోర్టు స్పష్టం చేసింది.
ఇక రాజధాని కేసులోనూ అమరావతికి అనుకూలంగా తీర్పు వస్తుందని అమరావతి రైతులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆ కేసులు ముందుకు నడవడం లేదు. ఆ కేసులు విచారణ దశలో పెండింగ్ లో ఉండగానే కాస్త ఊరట ఇచ్చేలాగా అసైన్డ్ రైతులకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.316పై తదుపరి చర్యలను నిలిపివేయడం, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ హైకోర్టు స్పష్టమైన నిర్ణయం వెల్లడించడంతో అమరావతి రైతుల్లో కాస్త సంతోషం వ్యక్తం అవుతోంది. మూడు రాజధానులకు సంబంధించి ప్రధాన కేసులో కూడా ఇటువంటి తీర్పే రావాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని అక్కడి రైతులు అయితే కోరకుంటున్నారు. నవంబర్ 15 తరువాత జరిగే రోజు వారి విచారణలో ఏమి జరుగుతుందో చూద్దాం.
1.YS Jagan: పార్టీ ప్రక్షాళన – ప్రభుత్వ ప్రక్షాళన..!? జగన్ మదిలో బోలెడు టార్గెట్లు..!
2.YSR 12th death anniversary: విజయమ్మ పెట్టిన పరీక్ష..! వైఎస్ సహచరుల అంతర్మధనం..!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?