ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నెలకొన్న జలజగడంపై సర్వత్రా ఉత్కంఠత కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకూ సఖ్యతగా ఉన్నఆంధ్ర, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్, కెసిఆర్ ఇద్దరూ వారి వారి రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కత్తులు దూసుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నేడు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అధ్యక్షతన ప్రారంభమైంది.
ఈ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్ వారి వారి వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై ఉత్కంఠతన కొనసాగుతోంది.
ఏపి అభ్యంతరాలు, తెలంగాణ వాదనలు, తెలంగాణ అభ్యంతరాలు, ఏపి వాదనలు పరిశీలిస్తే..
* గోదావరి నదిపై కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులు అకమమని ఏపి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర విభజనకు ముందున్న ప్రాజెక్టులకే డిజైన్ మార్చామని తెలంగాణ పేర్కొంటున్నది. * అనుమతులు లేకుండా పాలమూరు – రంగారడ్డి, దిండి, తుమ్మిళ్ల లిఫ్ట్ లు చేపట్టారన్న ఏపి అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన పనులనే కొనసాగిస్తున్నామన్నది తెలంగాణ వాదన. * శ్రీశైలంలో 800 అడుగుల నీరు ఉన్నప్పడే విద్యుత్ చేస్తున్నారని ఏపి అభ్యంతరం చెబుతుండగా రాష్ట్ర వాటా మేరకే నీటిని వాడుకుంటున్నామని తెలంగాణ చెబుతున్నది. * కృష్ణానదిపై ఎత్తిపోతల ద్వారా అక్రమంగా నీటిని తరలిస్తున్నారన్న ఏపి అభ్యంతరాలపై కృష్ణా బేసిన్లోని మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకే మా వాటా నీటిని ఇస్తున్నామని తెలంగాణ అంటున్నది.
* ఏపి ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తోందనీ తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా హక్కు ఉన్న వాటానే వాడుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ వివరిస్తున్నది. *విభజన చట్టానికి విరుద్ధంగా రాయలసీమ లిఫ్ట్, పొతిరెడ్డిపాడు కాలువ విస్తరణ చేపడుతున్నారనీ తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా పంపింగ్, రిపేర్లు చేయడం అంటే కొత్త ప్రాజెక్టులు చేపట్టినట్లు కాదని ఆంధ్రప్రదేశ్ పేర్కొంటున్నది. * 15 టీఎంసిలు తరలించడానికి అనుమతి ఉంటే రెట్టింపు నీటిని ఏపి తరలిస్తుందని తెలంగాణ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తుండగా సముద్రం పాలయ్యే జలాలను మాత్రమే తరలిస్తున్నామని ఏపి చెబుతున్నది. * కేటాయింపులకు మించి నీటిని తరలిస్తే తమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా వరద నీటిని తరలింపుతో కరువు ప్రాంతమైన రాయలసీమకు మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ అంటున్నది. * కొత్త ప్రాజెక్టులు అపెక్స్ కమిటి ఆమోదించాకే చేపట్టాలని తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా అవి కొత్త ప్రాజెక్టులు కాదు, ప్రత్యేకంగా అనుమతి అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ అంటున్నది. * నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ తమ ప్రభుత్వానికి అప్పగించాలని తెలంగాణ కోరుతుండగా రెండు ప్రాజెక్టు నిర్వహణను బోర్డుకే అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతోంది.
ఈ ఇరు ప్రభుత్వాల వాదనపై ఎపెక్స్ కౌన్సిల్ ఎటువంటి సూచనలు ఇస్తుంది. కౌన్సిల్ సూచనలకు ఇద్దరు ముఖ్యమంత్రులు అంగీకరిస్తారా? ఈ సమావేశంలోనే సమస్యల పరిష్కారానికి సాధ్యం అవుతుందా? మరో భేటీ కోసం వేచి చూడాల్సి వస్తుందా? అనేది వేచి చూడాలి.