2020 సంవత్సరం అన్ని అశుభాలే. శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నా కానీ.. కరోనా భయానికి అన్ని శుభకార్యాలను వాయిదా వేయాల్సి వచ్చింది. జరిగిన కొన్ని శుభకార్యాలు కూడా కొంత మంది సమక్షంలోనే జరపాల్సి వచ్చింది. ఇక ఈ యేడు అయినా శుభకార్యలను చేద్దాం అనుకుంటే.. మే నెల వరకు ఆగాల్సిన అవసరం ఏర్పడింది. శుభముహూర్తాలు శుక్రవారంతో ముగియడమే ఇందుకు ప్రదాన కారణం. గురుమూఢం 30 రోజులు, ఆ వెంటనే 81 రోజుల పాటు శుక్రమూఢం ఉంది. దాంతో దాదాపు నాలుగు నెలలు పెండ్లి ముహూర్తాలు లేకుండా పోయాయి. దీన్ని చూస్తుంటే 2021 తొలి అర్ధభాగం బాజాభజంత్రీలు మోగకుండా అయిపోయేలా కనిపిస్తోంది.
ఈ శార్వరినామ సంవత్సరంలో ముహూర్తాలు శుక్రవారంతో అయిపోయాయి. ఇక నాలుగు నెలల దాక శుభముహూర్తాలు లేవు. ముహూర్తాల్లో చివరి రోజైన శుక్రవారం లెక్కకు మించి పెళ్లిలు జరిగిపోయాయి. మంచి ముహూర్తాలు లేవని ఇళ్లు నిర్మా ణం పూర్తవకున్నా.. మళ్లీ మంచి రోజలు లేవని ఇంటికి గుమ్మడికాయ కొట్టి గృహప్రవేశం చేసిన వాళ్లూ చాలా మంది ఉన్నారు.
కరోనా కారణంగా శుభకార్యాలకు 2020లో గండిపడిందని చెప్పొచ్చు. ఇక 2021 అయినా అంతా మంచే జరుగుతుంది అనుకుంటే.. ఈ మూఢాలు వచ్చి ముహూర్తాలు లేకుండా చేస్తున్నాయి. మాములుగా మాఘమాసం మొదలు ఫాల్గుణం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఈ ఐదు నెలలు పెళ్లిలకు చాలా అనువైన సమయమని అందరి అభిప్రాయం. అందుకే ఫిబ్రవరి-మార్చి ముహూర్తాలకు ప్రాధా న్యం ఇస్తుంటారు. కానీ ఈ సంవత్సరం మూఢం కారణంగా మాఘం, ఫాల్గుణం, చైత్ర మాసాల్లో ముహూర్తాలు లేవు. సంక్రాంతి పండుగ వస్తునే గురుమూఢంను తీసుకువస్తుంది.
ఈ 14న మొదలవుతున్న గురుమూఢం వచ్చేనెల 12 వరకు ఉంటుంది. గురుమూఢం పోయిన మరుసటి రోజు నుంచే శుక్రమూఢం వస్తుంది. ఫిబ్రవరి 13న ప్రారంభమయ్యే ఈ శుక్రమూఢం మే 4తో ముగుస్తుంది. ఈ రెండు మూఢాలూ పోయేవరకు పెళ్లిలు, కొత్త ఇంటిప్రవేశాలు, ఉపనయనాలు, ప్రతిష్ఠలు, పుట్టు వెంట్రుకలు వంటి శుభ కార్యక్రమాలు చేయకూడదని పలువురు పంచాంగకర్తలు సూచిస్తున్నారు.