చైనాలోని వుహాన్ నగరంలో వెలుగు చేసిన కరోనా వైరస్ ప్రపంచ నలుమూలలకు వ్యాపించి.. యావత్ మానవాళిని ప్రమాదంలోకి నెడుతూ.. ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాలను సృష్టించింది. లక్షల మందిని బలి తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారిపై జరుగుతున్న పలు పరిశోధనల్లో రోజుకో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో అనేక ప్రశ్నలూ పుట్టుకొస్తున్నాయి. కాగా, ఇదివరకే కరోనా ప్రభావం వృద్ధులపై అధికంగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అలాగే, పురుషుల, మహిళల్లోనూ కరోనా ప్రభావం చూపడంలో వ్యత్యాసాలున్నట్టు తెలిసింది. అయితే, గర్భణీలకు కరోనా సోకితే ముప్పు మరింత ఎక్కువగా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైన సంగతి తెలిసిందే.
అయితే, గర్భిణీలకు కరోనా సోకితే వారికి కరోనా ముప్పు అధికంగా ఉంటుంది సరే ! మరి వారికి పుట్టబోయే పిల్లల పరిస్థతి ఏమిటి? నవజాత శిశువులకు కరోనా సోకుతుందా? ఒకవేళ అప్పుడే పుట్టిన పిల్లలకు కరోనా వస్తే ఎంతమేరకూ ప్రభావం చూపుతుంది? ఆ పిల్లలకు కరోనా సోకిన తల్లులు పాలు ఇవ్వొచ్చా? ఇలాంటి పలు రకాల ప్రశ్నలు రావడం సహజమే ! ఈ ప్రశ్నలకు సమాధానాలను కనుగొనే క్రమంలో పలువురు పరిశోధకులు పలు అధ్యయనాలు నిర్వహించారు. ఈ అధ్యయనాల్లో పైన పేర్కొన్నటువంటి అనేక ప్రశ్నలకు వివరణలు తెలిపారు.
అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ).. సాధారణ మహిళల కంటే గర్భిణీలకు కరోనా సోకే ప్రమాదం 50 శాతం అధికంగా ఉంటుందనీ, దాని ప్రభావమూ సైతం ఎక్కువగా ఉంటుందనీ, తప్పనిసరిగా ఐసీయూలో చికిత్స తీసుకోవాల్సి వస్తుందని తన రిపోర్టులో వెల్లడించింది. అయితే, తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం మాత్రం కరోనా సోకిన గర్భిణీల ద్వారా పుట్టబోయే పిల్లలకు ఎలాంటి ప్రమాదమూ ఉండబోదనీ, వారి నుంచి శిశువుకు కరోనా సోకదని వెల్లడించింది. కరోనా కారణంగా తల్లీబిడ్డలను వేరే చేయాల్సిన అవసరం లేదని తెలిపింది.
JAMA పిడియాట్రిక్స్ సంస్థ నిర్వహించిన పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి. గర్భిణీల నుంచి నవజాత శిశువులకు కరోనా సోకదు. సోకే అవకాశాలు, ప్రభావమూ తక్కువగానే ఉంటుంది. అయితే, కరోనా సోకిన వారిలో డెలివరీ టైం తగ్గుతున్నట్టు తెలిసింది. ఇలా డెలివరీ టైం కంటే వారం ముందుగా పుట్టిన పిల్లలకు కామెర్లు సోకే అవకాశముందని హెచ్చరించింది. దీని కోసం ఫొటోథెరఫీ చికిత్స అవసరమవుతుందని అధ్యయనం తెలిపంది. బిడ్డకు తల్లిపాలు పట్టడం సైతం సురక్షితమేనని పేర్కొంది. తల్లిబిడ్డలను ఒకే గదిలో ఉంచిన ఎలాంటి ప్రమాదం ఉండదని ఈ అధ్యయన పరిశోధకులు వెల్లడించారు. ప్రమాదం లేదని నిర్లక్ష్యంగా ఉండటం తగదనీ, తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, వైద్యుల పర్యవేక్షణ అవసరమని స్పష్టం చేసింది.