భారత ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ముందు భూమి పూజ చేశారు.ఇప్పటికే మీడియా.. సోషల్ మీడియా అంతటా రామ నామస్మరణను జపిస్తున్నాయి.
ప్రస్తుతం భారతీయులంతా అయోధ్యపైనే ఫోకస్ పెట్టారు.అయితే అయోధ్యలో ఇంతటి మహత్తర ఘట్టానికి ముఖ్యపాత్ర పోషించిన వారెవరు? అయోధ్య రామ మందిర ఉద్యమం పేరు చెప్పగానే లాల్ క్రిష్ణ అద్వానీ, అశోక్ సింఘాల్, మురళీ మనోహర్ వంటి వారి పేర్లే ప్రముఖంగా ఎందుకు వినిపిస్తున్నాయి తెలుసుకుందాం…
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నిర్మాత ఎవరంటే చాలా మందికి గుర్తుకొచ్చే పేరు అశోక్ సింఘాల్. ఈయన 2011 వరకు విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడిగా పని చేశారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేసిన అనంతరం 2015 నవంబర్ 17వ తేదీన మరణించారు.
అయోధ్యలో బాబ్రీ మసీదు విషయంలో హిందువులు, ముస్లింల మధ్య శతాబ్ద కాలానికి పైగా వివాదం నడుస్తోంది. ఆ మసీదు నిర్మించిన స్థలం.. తమ దేవుడైన రాముడి జన్మస్థలమని.. 16వ శతాబ్దంలో ఓ ముస్లిం ఆక్రమణదారు అక్కడ ఉన్న ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ మసీదును నిర్మించారని హిందువులు వాదిస్తున్నారు.
ఆ మసీదులో 1949 వరకూ తాము ప్రార్థనలు చేశామని.. అయితే ఆ ఏడాది కొంత మంది రాత్రి వేళ చీకట్లో రాముడి విగ్రహాలను తెచ్చి ఆ మసీదులో పెట్టారని ముస్లింలు అంటున్నారు. ఆ తర్వాతే ఆ విగ్రహాలను పూజించటం మొదలైందని వాదిస్తున్నారు.
ఆ తర్వాత నాలుగు దశాబ్దాల పాటు ఈ భూభాగం తమకే చెందుతుందంటూ హిందూ, ముస్లిం గ్రూపులు అక్కడ ప్రార్థనలు చేసే హక్కుల కోసం కోర్టులకు వెళ్లాయి. అయితే, 1992లో హిందువుల గుంపు మసీదును ధ్వంసం చేయటంతో ఈ వివాదం ఉద్ధృతమైంది. ఆ ఘటన నేపథ్యంలో జరిగిన మత అల్లర్లలో దేశవ్యాప్తంగా దాదాపు 2,000 మంది చనిపోయారు.
అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పులో త్రిసభ్య ధర్మాసనంలోని ఇద్దరు హిందూ న్యాయమూర్తులు.. భారతదేశంలో మొఘలు సామ్రాజ్య వ్యవస్థాపకుడైన బాబర్ నిర్మించిన ఆ భవనం నిజానికి మసీదు కాదని.. పేర్కొన్నారు. కూల్చివేసిన హిందూ దేవాలయ స్థలంలో ”ఇస్లాం సూత్రాలకు వ్యతిరేకంగా” దానిని నిర్మించారని వ్యాఖ్యానించారు.
ఈ ధర్మాసనంలో ముస్లిం న్యాయమూర్తి ఈ అభిప్రాయంతో విభేదించారు. అక్కడ ఏ ఆలయాన్నీ ధ్వంసం చేయలేదని.. ఆ మసీదును శిథిలాల మీద నిర్మించారని ఆయన వాదించారు.
1992 డిసెంబర్ ఆరో తేదీన విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ)కి చెందిన హిందూ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ), అనుబంధ సంస్థలకు చెందిన కొందరు నాయకులు.. 1,50,000 మంది స్వచ్ఛంద కార్యకర్తల తో అయోధ్యలోని ఈ వివాదాస్పద స్థలం దగ్గర ప్రదర్శన, సభ నిర్వహించినట్లు ఆరోపణ. ఆ ప్రదర్శన హింసాత్మకంగా మారింది. స్వచ్ఛంద కార్యకర్తల తో బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు. వారిని భద్రతా బలగాలు కూడా నియంత్రించలేకపోయాయి.
అప్పటి భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభను రద్దుచేసి రాష్ట్ర పాలనను తన ఆధీనంలోకి తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం 1993లో ఒక పాలనా ఉత్తర్వు ద్వారా మొత్తం 67.7 ఎకరాల విస్తీర్ణంలోని సదరు వివాదాస్పద స్థలాన్ని తన స్వాధీనం చేసుకుంది.
అనంతరం బాబ్రీ మసీదు విధ్వంస ఘటన మీద విచారణ నిర్వహించగా.. పలువురు బీజేపీ, వీహెచ్పీ నాయకులు సహా 68 మందిని బాధ్యులుగా గుర్తించారు. ఆ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ సీనియర్ నాయకులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, కల్యాణ్సింగ్, వినయ్ కటియార్, ఉమా భారతి తదితరుల ఆరోపిత పాత్ర మీద ప్రత్యేక సీబీఐ జడ్జి ఎస్.కె.యాదవ్ లక్నోలో విచారణ నిర్వహిస్తున్నారు.
”లక్నో సెషన్స్ కోర్టులో కొనసాగుతున్న బాబ్రీ మసీదు విధ్వంసం కేసు విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2020 ఏప్రిల్ 30వ తేదీ నాటికి పూర్తికావాలి” అని కౌశిక్ బీబీసీతో అన్నారు.
అలాగే, లక్నోలోని విచారణ కోర్టు ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్.కె.యాదవ్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిందని కూడా కౌశిక్ తెలిపారు.