బిగ్ బాస్ పండుగ షురూ అయిపోయింది. బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచపు అతిపెద్ద రియాల్టీ షో మొదలైపోయింది. ఎప్పటిలాగే సరైన మిక్స్ తో యాంకర్లు, గ్లామర్ బ్యూటీలు, సింగర్లతో, యూట్యూబ్ సెన్సేషన్స్ అయిన స్టార్లతో మళ్ళీ హౌస్ నిండిపోయింది. ఇక రకరకాల టాస్క్ లు, గేమ్ లు, గొడవలు, స్ట్రాటజీ లు, జైల్ లు, పనిష్మెంట్ లు, అవార్డులు, రివార్డులు. చివరికి అందరి టార్గెట్ ఒక్కటే..! బిగ్ బాస్ – 4 టైటిల్.
కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ ఆటలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎప్పటిలాగా సిబ్బంది ఎప్పుడు పడితే అప్పుడు లోనికి వచ్చి టాస్క్ లకు తగ్గట్టు ఏర్పాట్లు చేసేందుకు లేదు. అయితే అన్నిటికన్నా మరీ ముఖ్యం ప్రతి సీజన్లో హౌస్ మేట్స్ యొక్క కుటుంబ సభ్యులు లేదా సన్నిహితులు లోనికి వచ్చి ఎమోషనల్ అయ్యే ఎపిసోడ్ కూడా ఈసారి ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రతి సీజన్లో హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు కానీ సన్నిహితులు కానీ హౌస్ లోనికి అనుకోకుండా ఎంట్రీ ఇచ్చి వారి ఆత్మీయులను సర్ప్రైజ్ చేస్తుంటారు.
అంతే…. ఒక్కసారిగా హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా తీవ్రమైన భావోద్వేగానికి గురి అవుతారు. ఎంతోమంది కన్నీళ్లు పెట్టుకుంటారు కూడా. అయితే ఈ కరోనా నేపథ్యంలో సామాజిక దూరం పాటించాల్సిన సందర్భంలో ఇటువంటి చర్యలు ఏమీ తీసుకోకూడదని నిర్వాహకులు నిర్ణయించుకున్నారట.
అయితే కంటెస్టెంట్స్ అందరిలో…. కొంతమంది సభ్యులు ఇప్పటికే పూర్తిగా ఎమోషనల్ అయిపోయారు. ఉదాహరణకు మోనాల్ గజ్జర్ ను తీసుకుందాం. ఎంతో ఎనర్జీ ఉన్న ‘డాంగ్ డాంగ్’ సాంగ్ తో హౌస్ లోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు.. త్వరగా అందరితో చలాకీగా కలిసిపోయింది. ప్రతీ ఒక్కరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉంటే… సరదాగా తిరిగే అమ్మాయి అనుకున్నాం కానీ తనకు తన ఇంట్లో వాళ్ళతో ఉండే అనుబంధం గురించి అమ్మ రాజశేఖర్ కు వివరించి ఆమె ఎమోషనల్ కావడం చూశాం. తన 15వ ఏటనే తన తండ్రి చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకున్న అమ్మాయి ఇక ఉన్న కుటుంబ సభ్యులని ఇన్ని రోజులు కలవలేను అని తలచుకొని చాలా బాధపడింది.
హౌస్ లోకి వచ్చిన వెంటనే కూడా తను వారి వాళ్ళను గుర్తు తెచ్చుకొని మోనాల్ కన్నీటి పర్యంతం అయిపోయారు.కాబట్టి టైటిల్ రేసులో ఆమె కనుక చివరి వరకు ఉంటే కచ్చితంగా తన కుటుంబ సభ్యులను నేరుగా కలుసుకోలేని పరిస్థితి. ఇదే పరిస్థితి మిగతా ఇంటి సభ్యులది కూడా..! అలాగే లాస్య, గంగవ్వ, జోర్దార్ సుజాత, కరాటే కళ్యాణి వంటి వారు కూడా తమ కుటుంబ సభ్యుల పై ఇప్పటికే తమకు ఉన్న ప్రేమను బయటకు చూపించారు. అందరికీ ఇది కచ్చితంగా ఇది చేదు వార్తే అని చెప్పాలి.