గత కొద్దికాలం నుంచి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నుంచి ఇంకా బయట పడలేదు. అయితే ఈ అంతుచిక్కని వ్యాధికి ఏ మందు వాడాలో డాక్టర్ లు సతమతమవుతున్నారు. రోజు రోజుకి దీని ప్రభావం మరింత ఎక్కువవుతోంది. అయితే దీనికి తోడు వర్షాకాలం మొదలవడంతో దోమల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారా ఎన్నో ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయి. కొత్తగా ఇప్పుడు కరోనా సోకిన వారికి డెంగ్యూ రావడంతో డాక్టర్లకే అతిపెద్ద సవాలుగా మారింది. దీనికి ఎటువంటి చికిత్స ఇవ్వాలో తెలీక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ తరహాలో డబుల్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. దీనితో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఇటువంటి సమస్యలకు చికిత్స చేయడానికి సరైన ప్రమాణాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ఒకేసారి ఈ తరహా లో రెండు జబ్బులకు గురైన వారికి ఏకకాలంలో సరైన వైద్యం అందించడంలో ఎంతో సమతుల్యతను పాటించవలసిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
కరోనాతో బాధపడే వ్యక్తులకు రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి, హెపారిన్ అనే మందులు ఇస్తారు. ఇది రక్తం లోకి వెళ్లి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అయితే కరోనా తో బాధపడే వ్యక్తి డెంగీ బారిన పడినవారికి రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తాయి. ఒకే సమయంలో హెపారిన్ ఇంకా రక్తంలోకి ప్లేట్లెట్స్ ఎక్కించడం వల్ల తీవ్ర సమస్యలను ఎదుర్కోవల్సిన పరిస్థితి వస్తుందని, వీటిని దృష్టిలో ఉంచుకొని సరైన పద్ధతిలో చికిత్స అందించాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఏ మాత్రం అశ్రద్ధ వహించినా కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు నని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు సంభవించకుండా ఉండాలంటే దోమల నుండి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇలాంటి ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు.