కాలం మారుతూ ఆధునిక రూపు సంతరించుకునీ, శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్తపుంతలు తొక్కుతున్నది. అయితే, సమాజంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. మూఢనమ్మకాల కారణంగా ఇప్పటికే దారుణమైన ఘటనలు నిత్యం ఏదో ఒక చోటుచేసుకుంటునే ఉన్నాయి. ఇదే తరహాలో దేవుడి ప్రసన్నం కోసం ఉత్తరప్రదేశ్లోనూ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది.
దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానకి భక్తులు వివిధ రకాలుగా పూజలు చేస్తున్నారు. అనేక రకాలైన నైవేద్యాలు సైతం పెడుతున్నారు. ఈ క్రమంలోనే యూపీలోని బాబేరు ప్రాంతంలోని భాటి గ్రామంలో ఓ యువకుడు తన నాలుకను అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి సిద్ధమై.. తన నాలుకను కోసుకున్నాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. గత తొమ్మిది రోజులుగా నిత్యం అమ్మవారికి పూజలు చేస్తున్న ఆత్మారామ్ (22) అనే యువకుడు.. ఆదివారం కూడా ఆలయానికి వచ్చి దుర్గామాతకు నైవేద్యమంటూ తన నాలుకను కోసుకున్నాడు. అది చూసిన ఆలయంలోని భక్తులు భయాందోళనకు గురయ్యారు. దీని గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అమ్మవారికి తన నాలుకున సమర్పించడానికే ఆ యువకుడు ఈ చర్యకు సిద్ధమయ్యాడని పోలీసు తెలిపారు. నాలుక కోసుకున్న తర్వాత తీవ్ర రక్తస్రావం అయిందని చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామనీ, ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా, తన కుమారుడికి మతిస్థిమితం సరిగాలేదనీ, ఎవరో వాడిని ప్రేరేపించడంతో ఇలా చేసుకుని ఉంటాడని ఆత్మారమ్ తండ్రి తెలిపాడు.
అలాగే,యూపీలోని కురారా ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇక్కడ ఏకంగా 49 ఏళ్ల వ్యక్తి.. దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తన మెడనే కోసుకున్నాడు. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు వెల్లడించారు.