నరకాసురుడనే రాక్షసుడిని సంహారంతో..అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినపుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెపుతోంది. చీకటిని పారదోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ ను భారతీయులతో పాటు పలు దేశాల్లోనూ ఘనంగా జరుపుకుంటున్నారు.
అయితే, ఇంతటి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ…ఒక గ్రామంలో మాత్రం దీపావళి పండుగ నిషేధం. ఆ పండుగను అస్సలు జరుపుకోరు. ఒకటి రెండు సంవత్సరాలుగా అనుకుంటే పొరపాటే.. దాదాపు 200 ఏళ్లకు పైగా అవుతోంది ఆ గ్రామంలో దీపావళి జరుపుకోక. అలాగే నాగుల చవితి కూడా అక్కడ నిషేధమే. ఎందుకు ఆ గ్రామంలో దీపావళి, నాగుల చవితిలపై నిషేధం? దాని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దీపావళిపై నిషేధం విధించిన గ్రామం ఎక్కడో లేదు.. మన తెలుగు రాష్ట్రామైన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. అదే శ్రీకాకుళం జిల్లా, రణస్థలం మండలం, పున్నన పాలెం గ్రామం. దీపావళి రోజు ఆ గ్రామంలో టపాసుల మోత, దివ్వెల వెలుగుల సందడి, ఇంకా బోలెడన్ని సంబరాలు ఏవీ కనిపించవు. ఇళ్లలో ఒక్క దీపం కూడా వెలిగించరు. నోరు తీపి చేయటమనే మాటే ఉండదు. ఇలా చేయడానికి చాలా చరిత్ర ఉందని.. ఇది తమ ఆచారమంటూ గ్రామస్తులు అంటున్నారు.
ఆ చరిత్ర వారి మాటల్లోనే… పున్నన పాలెం గ్రామంలో 200 సంవత్సరాల క్రితం దీపావళి రోజున పాము కాటు వల్ల ఓ చిన్న పిల్లోడు చనిపోయాడు. అలాగే రెండు ఎద్దులు కూడా చనిపోయాయి. అప్పుడు ఆ గ్రామ పెద్దలు నాగుల చవితి, దీపావళి రెండు పండుగలు జరుపుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. దాన్నే అందరూ ఇప్పటికీ పాటిస్తున్నారు. పోలీసులు, జనచైతన్య వేదికలు, ప్రభుత్వ అధికారులు కూడా అది మూడాఛారమని చెప్పినా అది తమ ఊరు కట్టుబాటు అని, పూర్వీకుల నుంచి వస్తున్నా సంప్రదాయం అని గ్రామస్తులు చెబుతుండటం గమనార్హం.