ఎలాంటి ఆహార పదార్థాలు అయినా మితంగా తినటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.అదే ఆహార పదార్థాలను పరిమితికి మించి తీసుకోవడం ద్వారా అనేక సమస్యలు తలెత్తుతాయనే విషయం అందరికీ తెలిసినదే. ఇందులో భాగంగానే బొప్పాయిలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే.
అయితే ఈ బొప్పాయిని ఎక్కువగా తీసుకోవడం వలన అనేక సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణంగా బొప్పాయి తింటే చర్మ సమస్యలు దూరమై చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. అదేవిధంగా జీర్ణక్రియ సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి. అయితే బొప్పాయి అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
గర్భిణీ స్త్రీలు బొప్పాయిని తినకూడదని చెబుతుంటారు.బొప్పాయిలో ఉన్న హార్మోన్ల వల్ల గర్భస్రావం జరిగి కొన్ని సార్లు అబార్షన్ అయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. అందుకోసమే గర్భిణీ స్త్రీలు ఈ బొప్పాయి తినకూడదని చెబుతుంటారు. బొప్పాయి ను పరిమితికి మించి తీసుకోవడం వల్ల మన చర్మం రంగు మారడంతోపాటు కామెర్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ బొప్పాయి వల్ల ఆస్తమా, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
బొప్పాయి పండును ఎక్కువగా తీసుకున్న వారిలో కొన్నిసార్లు వాంతి,వికారం, కడుపులో ఉబ్బరం మొదలైన సమస్యలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా పాలిచ్చే తల్లులు సైతం బొప్పాయిని అధికమొత్తంలో తీసుకోకూడదని చెబుతారు. ఎక్కువ మొత్తంలో బొప్పాయి తీసుకోవడం ద్వారా బిడ్డలో జీర్ణక్రియ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల బొప్పాయిని తీసుకునే వారు కేవలం పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.పరిమితికి మించి తీసుకోవడం వల్ల ఇలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు.