వంద సంవత్సరాల నుంచి శాస్త్ర విజ్ఞాన రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. దాని సాయంతోనే రోదసిలోకి కూడా అడుగులు పెడుతున్నాం. మన ఆయుష్షును పెంచుకునేందుకు ఎన్నో మార్గాలను ఏర్పాటు చేసుకున్నాం. అంతు చిక్కని రోగాలకు సైతం సర్జరీలతో నయం చేసే టెక్నాలజీని కనుగొన్నాం. ఈ మార్పులే మనల్ని అభివృద్ధి వైపు తీసుకుపోతున్నాయి అనడానికి నిదర్శణం. అయితే మనకు తెలిసిన ఈ శస్త్ర చికిత్సలు వెయ్యేండ్ల ముందు కూడా జరిగాయని మీకు తెలుసా..? అయితే ఆ చికిత్సలు కూడా ఎక్కడో బయటి దేశంలో కాదు. మన దేశంలోని ఏదో ఒక రాష్ట్రంలో కూడా కాదు. మన తెలంగాణలోనే.
అవును నిజమే.. వెయ్యేండ్ల ముందే తెలంగాణలో సర్జరీలు జరిగాయట. మనకు ఈ వార్త వింటుంటే పలు ప్రశ్నలు రావొచ్చు. మన దగ్గర ఆ కాలంలో కూడా సర్జన్లు ఉన్నారా? అయితే ఏ సర్జరీలు జరిగాయి? ఇది ఫేక్ న్యూస్ కాదు కదా? అనే పలు రకాల ప్రశ్నలు రావొచ్చు. వీటిని నిజమేనని వైద్యవిజ్ఞాన వారసత్వ కేంద్రం పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.
ఈ కాలంలోనే ఎంతో కష్టమైన శస్త్ర చికిత్సలు అప్పుడెలా చేసేవారో అంతు చిక్కడం లేదని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈ కంప్యూటర్ యుగంలోనే ఎంతో కష్టంతో కూడిన ఈ సర్జరీలను అప్పుడే చేశారంటే మన దగ్గర ఎలాంటి టెక్నాలజీ ఉందో అర్థం చేసుకోవాలి. దీన్ని చూసిన పలువురు నిపుణులు నిజంగానే చాళుక్యుల కాలంలోనే సర్జరీలు మొదలై ఉంటాయని చెబుతున్నారు.
క్రీస్తు శకం 1034లోనే సర్జరీలు జరిగాయి అనడానికి రుజువుగా అగ్గలయ్య అనే వైద్యుడు ఒక శాసనం వేయించాడు. దాని తాలుక శాసనం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల బయట పడింది. ఈ విషయం విన్న పలువురు ఆశ్చర్యానికి గురవుతున్నారు.