మనిషిని అదృష్టం ఏ విధంగా తలుపు తడుతుందో ఎవరూ చెప్పలేరు. ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయనే సామెతలాగే అదృష్టం వరిస్తే కటిక దరిద్రం అనుభవిస్తున్న వాడు కూడా క్షణాల వ్యవధిలో కోటీశ్వరుడు కాగలడు. అయితే ఆ అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఏ విధంగా వరిస్తుందో మాత్రం ఎవరూ చెప్పలేరు. తాజాగా ఒక వృద్ధురాలిని అదృష్టం చేప రూపంలో వరించింది. పది కాదు వంద కాదు ఆ చేప విలువ ఏకంగా మూడు లక్షల రూపాయలు పలికింది.
భారీ ఆకారంతో కనిపించే ఆ చేపను మోయడం కూడా అంత సులభం కాదు. అయితే వృద్ధురాలు పడిన కష్టానికి మాత్రం ఊహించని ఫలితం దక్కింది. కష్టాలతో ఇబ్బందులు పడుతున్న బామ్మ చేప వల్ల లక్షాధికారి అయింది. పశ్చిమ బెంగాల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. సాగర్ ఐలాండ్స్లో నివశిస్తున్న పుష్ప కౌర్ చేప వల్ల ఒక్కరోజులో ఫేమస్ అయింది. సుందర్బన్లోని సముద్రంలో ప్రతిరోజూ లాగే చేపల వేటకు వెళ్లగా ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప రూపంలో అదృష్టం వరించింది.
52 కిలోల ఆ చేపను చూడగానే వృద్ధురాలు పడిన ఆనందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఆ చేపను మార్కెట్ కు తీసుకురాగా ‘భోలా’ అనే అరుదైన చేప ఖరీదు కిలో 6,200 రూపాయలు అని తెలిసింది. రుచిగా ఉండే ఆ చేప ఏకంగా మూడు లక్షలకు అమ్ముడుపోయింది. అరుదుగా మాత్రమే ఇలాంటి చేపలు సముద్రం ఒడ్డున దొరుకుతాయని స్థానికులు చెబుతున్నారు. ఔషధాల తయారీలో సైతం ఈ చేపను వినియోగిస్తారని సమాచారం.