ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) తాజాగా మరో శుభవార్తను అందించింది. పెన్షన్ పొందుతున్నావారికి భారీ ఊరటను కలిగించే విధంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా వచ్చే ఏడాది (2021) ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఎలాంటి ఇబ్బంది లేకుండా పెన్షన్దారులు తమ పెన్షన్ ను పొందవచ్చు. జీవన్ ప్రమాణ్ (లైఫ్ సర్టిఫికెట్) పత్రాన్ని సమర్పించడానికి గడువును మరోమారు పొడిగించింది.
ఇటీవలే మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు.. పెన్షన్ పొందుతున్న వారు తమ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించడానికి గడువును పెంచుతామని ప్రకటించింది. ఈ క్రమంలోనే తాజాగా దీనికి అమల్లోకి తీసుకువచ్చినట్టు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం.. పెన్షన్ దారులు తమ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని 2021 ఫిబ్రవరి 28 లోపు ఎప్పుడైనా సమర్పించవచ్చు. ఈ నిర్ణయం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకూ తమ పెన్షన్లను తీసుకొవచ్చని తెలిపింది.
ఈ నిర్ణయం ద్వారా దాదాపు 35 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు ప్రయోజనం లభించనుంది. దీనిపై కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ మాట్లాడుతూ.. ఈపీఎఫ్వో పెన్షన్దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి ఏడాది నవంబర్ 1 చివరి తేది కాగా, దాదిని డిసెంబర్ నెలాఖరు వరకూ ఇదివరకూ పొడిగించామని తెలిపారు. మళ్లీ దీనిని రెండో సారి పొడిగిస్తూ.. వచ్చేఏడాది ఫిబ్రవరికి పెంచామని తెలిపారు.
అలాగే, పెన్షన్ దారులు తమ జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించడానికి సులువైన మార్గాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. పెన్షన్ దారులు తమ లైఫ్ సర్టిఫికెట్ను పెన్షన్ తీసుకుంటున్న బ్యాంక్, ఫోస్టాఫీసు లతో పాటు కామన్ సెర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లలో ఎక్కడైనా అందించవచ్చునని తెలిపారు. కరోనా వైరస్ (కోవిడ్-19) దేశంలో ఇప్పటికీ తన ప్రభావాన్ని పెంచుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజల సంరక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని మోడీ సర్కారు వెల్లడించింది.