Etela Rajender: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరటం దాదాపు ఖాయం అయిపోయింది. భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో ఈటల నుండి కేసిఆర్ మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే. ఆ రోజు నుండి తన రాజకీయ భవిష్యత్తుపై సన్నిహితులతో మంతనాలు సాగించిన ఈటల చివరకు బీజేపీలో చేరడానికి సిద్ధం అయ్యారు. ఇదే క్రమంలో తనకు ఉన్న డౌట్ ను క్లారిఫై చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన ఈటల నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంలోనే ఈటల పలు సందేహాలను లేవనెత్తినట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది నానుడి. రాజకీయ పార్టీలు వేరైనా, పైకి విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నా పలు సందర్భాల్లో లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవడం అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో రాబోయే రోజుల్లో బీజేపీ టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తమ లాంటి వారి పరిస్థితి ఏమిటి అన్నది ఈటెల డౌట్. ఇప్పటికే బీజేపీ, టిఆర్ఎస్ ఒక్కటేనన్న భావన తెలంగాణ ప్రజల్లో ఉందని, అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక కుంభకోణాలు జరుగుతున్నా కేంద్రం ఇప్పటి వరకూ ఒక్క విచారణ కూడా చేపట్టలేదని అనుకుంటున్నారని ఈటల నడ్డా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
ఈటల రాజేందర్ డౌట్లకు నడ్డా సమాధాన పర్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ తో బీజేపీ పోరు కొనసాగుతుందని తేల్చి చెప్పిన నడ్డా..పశ్చమ బెంగాల్ ను ఉదాహారణ గా పేర్కొన్నట్లు సమాచారం. అక్కడ మూడు స్థానాల నుండి దాదాపు అధికారం చేజిక్కించుకునే వరకూ ఎదిగామనీ, అదే మాదిరిగా తెలంగాణలోనూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని ఈటలకు నడ్డా వివరించినట్లు తెలుస్తోంది. సమయం వచ్చినప్పుడు కుంభకోణాలపై విచారణ చేపడతామని , టీఆర్ఎస్తో బీజేపీ కలిసి పని చేసే ఆలోచన లేదని ఈటలకు నడ్డా స్పష్టం చేశారు. నడ్డాతో సమావేశం ముగిసిన తరువాత ఈటల ఒక క్లారిటీకి వచ్చేశారు. కొద్ది రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అధికారికంగా బీజేపీ కండువా కప్పుకోనున్నారు ఈటల.