ఈ మధ్యకాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు సంతరించుకోవడం వల్ల ఎక్కువశాతం తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆహార విషయంలో మార్పుల కారణంగా మధుమేహానికి గురవడంతో పాటు, ఎముకలలో క్యాల్షియం శాతం క్షీణించి దీర్ఘకాలిక ఆర్థరైటిస్ నొప్పులతో బాధ పడుతున్నారు. ఈ విధంగా ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు వారి చూపు ప్రస్తుతం తృణధాన్యాల పై పడింది. శరీర బరువు తగ్గాలన్నా,శక్తిసామర్ధ్యాలను పెంచుకోవాలన్న ఖచ్చితంగా వారి ఆహారంలో తృణధాన్యాలు తప్పనిసరని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఎముకలు దృఢంగా తయారవ్వాలంటే తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
సాధారణంగా కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడేవారికి ఎక్కువగా ధాన్యాలను తీసుకోకూడదని నిపుణులు తెలియజేస్తుంటారు. అందుకు గల కారణం వీటిలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉండటమే. కానీ చిరు ధాన్యాలు రాగులు, సజ్జలు, జొన్నలు వంటి వాటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. రాగులు సజ్జలు లో ఉండే పోషకాలు ఎముకలకు ఎంతో దృఢత్వాన్ని ఇస్తాయని, వీటిని తీసుకోవడం ద్వారా ఎముకలలో వాపు తగ్గి ఎముకలు దృఢంగా తయారవడానికి సరిపడా పోషకాలను అందిస్తాయని చెప్పవచ్చు.
రాగులలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల వీటిని తీసుకోవడం ద్వారా మన ఎముకలకు సరిపడా కాల్షియం అందుతుంది.వంద గ్రాముల రాగులతో 244 మి.గ్రా. క్యాల్షియం లభిస్తుంది. దీని ద్వారా మన శరీరంలో ఎముకలు అరుగుదల,ఎముకలు క్షీణించడం వంటి సమస్య నుంచి విముక్తిని కలిగిస్తుంది.అదేవిధంగా సజ్జలలో పాస్పరస్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇది కాల్షియంతో కలిసి ఎముకలు దృఢంగా తయారవడానికి దోహదపడుతుంది. కేవలం 100 గ్రాముల సజ్జలలో42 మి.గ్రా. క్యాల్షియం, 296 మి.గ్రా. ఫాస్ఫరస్ ఉంటాయి. అందుకోసమే మన ఆహారంలో రాగులను, సజ్జలను చేర్చుకొని రొట్టెలు, చపాతీలు వంటివాటిని చేసుకోవటం ద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.