ఆడవారికి బంగారం మీద మక్కువ ఎక్కువ.ఎంత ఉన్నప్పటికీ కూడా కొనాలని అనిపిస్తూనే ఉంటుంది. అయితే ప్రస్తుతం బంగారానికి రెక్కలొచ్చాయి. ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. బంగారం ఎంత రేటు పలికిన అప్పటికీ ప్రజలు ఎంతో ఇష్టంగానే కొంటున్నారు. ఆడవారితో పాటు మగవారు కూడా ఈ మధ్య కాలంలో బంగారం ఎక్కువగా వేసుకుంటున్నారు. అంత ధర పలికే బంగారం ఒక్కసారిగా దొరికితే ఎలా ఉంటుంది? అవును నిజంగానే రోడ్డు పక్కన బంగారు నాణేలు కనిపించి ఒక్కసారిగా అందరిని ఆకర్షించాయి. అయితే వీటిని తీసుకునేందుకు జనం తండోపతండాలుగా ఎగబడ్డారు. అయితే ఈ ఘటన చిత్తూరు జిల్లా సమీపంలో చోటు చేసుకుంది.
చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దులోని తమిళనాడు ప్రాంతంలో కృష్ణగిరి జిల్లా హోసూరు లో రోడ్డు పక్కన బంగారు నాణాలు కుప్పలు కుప్పలుగా దర్శనమిచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఆ నాణేలు కోసం ఎగబడ్డారు. ఈ నాణేల కోసం కొందరు కాలినడకన కూడా బయలుదేరారు, మరికొందరు ద్విచక్ర వాహనాలు వెళ్లి ఎవరు దొరికిందంతా వారు తీసుకున్నారు. ఒక్కసారిగా జనం ఎగబడే సరికి అక్కడ జాతర వాతావరణం కనిపించింది. హోసూరు_భాగలురు రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అంతరాయం కలిగింది.
మట్టి దిబ్బల కింద బయటపడిన ఈ బంగారు నాణేలు పై అరబిక్ భాష కు చెందిన అక్షరాలను ముద్రించి ఉన్నాయి ఒక్కొక్కనాణెం దాదాపు రెండు గ్రాముల బరువు ఉన్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చేసరికి ఒక్క బంగారు నాణెం కూడా లేకపోవడం గమనార్హం. అయితే ఇవి ఇక్కడికి ఎలా లభ్యమయ్యాయి. అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.