Mango Tree: మామిడిచెట్టు Mango Tree మామిడి సీజన్ మొదలవుతోందంటేనే తోటలకు యజమానులు కాపలా మనుషులను ఉంచుతారు. తోటల చుట్టూ భారీ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తారు. ఇది ప్రతిచోటా జరిగేదే. అయితే.. ఇంత సెక్యూరిటీ తోట మొత్తానికి ఏర్పాటు చేస్తారే కానీ ప్రత్యేకించి ఏ ఒక్క మామిడి చెట్టుకో అయితే ఏర్పాటు చేయరు. అందులోనూ 24 గంటలూ ప్రత్యేక కాపలా ఏ యజమాని కూడా పెట్టడు. కానీ.. ఇలాంటి విచిత్రమైన సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. ఒక మామిడి చెట్టు చుట్టూ నలుగురు వ్యక్తులు, ఆరు కుక్కలతో భారీ కాపాలా పెట్టాడో యజమాని. పైగా ఈ చెట్టుకు కాసేది కేవలం ఏడంటే.. ఏడు కాయలు. ఈమాత్రం కాపుకు ఇంత కాపలా ఎందుకో.. ఏంటో తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు చెందిన ఓ మామిడి తోట యజమాని పరిహార్.. ఇలా ఒక మామిడి చెట్టుకు భారీ రక్షణ ఏర్పాటు చేశాడు. నలుగురు మనుషులు, ఆరు కుక్కలతో కాపలా పెట్టి మామిడి చెట్టును కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. ఎందుకిలా అంటే.. ఈ ఏడు మామిడి పండ్లకు అత్యధిక ధర పలకడమే కారణం. ధర ఎంత..? అనుకుంటున్నారా.. ఒక కేజీ మామిడి పండ్లు అక్షరాలా 2.70 లక్షలు కాబట్టి. అవునా? అని ఆశ్చర్యపోకండి? ఇది నిజమే అంటున్నాడు పరిహార్. ఈ మామిడిపండ్లు జపాన్ కు చెందిన ‘మియజాకి’ అనే అరుదైన జాతికి చెందినవి కాదడమే ఇందుకు కారణమట. పరిహార్ ఓసారి చెన్నైకి రైలులో వెళ్తుంటే.. ఓ వ్యక్తి ఈ మొక్కను ఇచ్చాడట.
Read More: Auto Driver: లక్కీ ఆటో డ్రైవర్..! రాజస్థాన్ టు స్విట్జర్లాండ్ సక్సెస్ ఫుల్ జర్నీ
అయితే.. అప్పుడు ఈ మొక్క ప్రపంచంలోనే ఎక్కువ ధర పలికే మామిడి మొక్క అని తెలీదంటున్నాడు. మొక్క నాటిన తర్వాత కాపు కాసిన తర్వాత ఓ వ్యాపారి ఒక్క కాయనే 21వేలు పెట్టి కొన్నాడట. ఈ మామిడి వాల్యూ తెలియడంతో గతేడాది కాసిన కాయలు దొంగతనానికి గురయ్యాయట. దీంతో ఈ ఏడాది గట్టి కాపలా పెట్టానని చెప్తున్నాడు. అయితే.. ఈమామిడి కాయలు అమ్మదలచుకోలేదని.. వీటిని తోటలా పెంచడానికే ఉపయోగిస్తున్నట్టు చెప్తున్నాడు పరిహార్. అరుదైన జాతి కాయలు కాబట్టే ఇంత ధర అని మధ్యప్రదేశ్ హార్టికల్చర్ విభాగం అధికారులు అంటున్నారు.