దశలవారీగా నెలల తరబడి లాక్ డౌన్ విధించినా కూడా కరోనా వైరస్ కేసులు విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్రతి రోజు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న కరోనా వైరస్…. మన దేశంలో ఎప్పటికప్పుడు అత్యధికంగా కేసులు నమోదు చేస్తూ ప్రపంచంలోనే ఇప్పటివరకు అత్యధిక కేసులు నమోదైన దేశాలలో ఏడవ స్థానంలో భారత్ నిలిపింది. నిన్న ఒక్కరోజే ఎనిమిది వేల పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. ప్రతి రాష్ట్రంలో కూడా తమ రోజువారి రికార్డును ప్రతిరోజు సవరణ చేసుకుంటూ ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం లాక్ డౌన్ నుండి కొన్ని కీలకమైన మినహాయింపులు ఇవ్వడంతో అసలు లాక్ డౌన్ అన్నది ఉందా లేదా అన్న విషయం కొన్ని ప్రాంతాల్లో అయితే స్పష్టంగా తెలియడం లేదు. ఖచ్చితంగా చెప్పాలంటే కేంద్రం ‘అన్ లాక్’ ప్రక్రియను ప్రారంభించింది.
ఒక్క కంటెంట్మెంట్ జోన్ లను మినహాయించి అన్ని చోట్ల మాల్స్ తెరచుకునేందుకు అనుమతులను ఇచ్చిన కేంద్రం ఇప్పుడు అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ప్రారంభించడానికి ఓకే చెప్పేసింది. అతి తక్కువ కేసులు ఉన్నప్పుడు లాక్ డౌన్ పక్కాగా అమలు చేసి…. ఇప్పుడేమో ప్రజలకు స్వాతంత్రం కల్పించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కేంద్రం ఒక వ్యూహంతో వెళుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. విషయం ఏమిటంటే కరోనాను లాక్ డౌన్ వల్ల తరిమికొట్టడం అసాధ్యమని కొద్దిరోజులకే అర్థం అయిపోయింది. ఇక లాక్ డౌన్ పేరుతో వ్యాపార కార్యకలాపాలను స్తంభింపచేసి…. ప్రజలను తీవ్రమైన ఇబ్బందులకు గురి చేసే బదులు అందుకు ప్రత్యామ్నాయం ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే ఒక మార్గం ఉందని కేంద్రం తెలుసుకున్నారు.
దీంతో కరోనా సోకకుండా ప్రజలను ఏమాత్రం కట్టడి చేయలేని అర్థమైన ప్రభుత్వం కరోనా వచ్చినా తట్టుకునే సామర్థ్యాన్ని ప్రజల్లో పెంచడం తప్ప మరో మార్గం లేదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సామూహికంగా రోగనిరోధకశక్తి పెంచితే కరోనా వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది అని…. ఇప్పటికే బ్రిటన్, స్వీడన్ వంటి దేశాలు ఈ విషయంలో మెరుగైన ఫలితాలు సాధించినట్లు కూడా రుజువులు ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని నేరుగా చెప్పి ఇష్టం వచ్చినట్లు మీరు బయట తిరగకండి అని చెబితే అనేక విమర్శలు వస్తాయి అని…. ప్రజలను కరోనాకు వదిలి పెట్టేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెడతాయి.
దీనితో హెర్డ్ ఇమ్యూనిటీ దేశంలోని ప్రజల మధ్య రావాలి అంటే కొద్ది కొద్దిగా నిబంధనల ఎత్తివేత ద్వారానే అది సాధ్యం అవుతుంది. కేంద్రం ఇచ్చిన సడలింపులలో అతి కీలకమైనది చిన్న పిల్లలు మరియు వృద్ధులు బయటకు రాకపోవడం. వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వైరస్ సోకినప్పుడు వారిని కాపాడుకోవడం కష్టం అవుతుంది. అందుకే సడలింపులలో కూడా వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు అని నిబంధనలు విధించారు. యువతకు మరియు మధ్య వయస్కులకు వైరస్ ప్రభావాన్ని తట్టుకునే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది.
ఇక ఈ మధ్య కాలంలో నమోదు అయిన కేసుల్లో 70 నుంచి 80 శాతం మందికి అసలు లక్షణాలు కనిపించడం లేదు. లక్షణాలు బయట పడకుండా రోగనిరోధకశక్తి ప్రభావంతోనే చాలామందికి తగ్గిపోయి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్లోని కంటెయిన్మెంట్ జోన్లలో ఐసీఎంఆర్ ప్రత్యేక పరీక్షలు చేసింది. పెద్ద ఎత్తున శాంపిళ్లను సేకరించింది. ఈ ఫలితాలతో కరోనా ఎంత మందికి సోకి నయమయిందో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హెర్డ్ ఇమ్యూనిటీ దిశగా వెళ్తున్నామో లేదో కూడా తెలుస్తుందని అంచనా వేస్తున్నారు