ఐపీఎల్ 2020 పాయింట్స్ టేబుల్ లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు జరిగిన పోరు కాస్త ఏకపక్షం అయింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్…. ఢిల్లీ క్యాపిటల్స్ ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఢిల్లీ తమ ముందు ఉంచిన 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ముంబై టేబుల్ లో మొదటి స్థానానికి దూసుకెళ్లింది.
సౌత్ ఆఫ్రికన్ ఓపెనర్ క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్ చెరో 53 పరుగులతో ఛేదనలో ముంబై కు గట్టి పునాది వేశారు. మొదటి ఇన్నింగ్స్లో ఢిల్లీ తరఫున ఓపెనర్ శిఖర్ ధావన్ 69 పరుగులు చేసి నాటౌట్ గా నిలువగా కెప్టెన్ అయ్యర్ 42 పరుగులు చేయడంతో ఢిల్లీ 162 పరుగుల తో సరిపెట్టుకుంది.
మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ కి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్ లభించలేదు. టోర్నీలో తొలి మ్యాచ్ ఆడుతున్న రాహానే పెద్దగా పరుగులేమీ చేయకపోగా మొదటి ఓవర్ లోనే యువ పృథ్వి వికెట్ కోల్పోయింది. ఇలాంటి సమయంలో ఇన్నింగ్స్ను అయ్యర్, ధావన్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. 85 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీనిని కాస్తా అశ్విన్ విడదీశాడు. అయ్యర్ అవుటైన తర్వాత ధావన్ మరొకవైపు ఒక్కరే ఒంటరిగా పోరాడటం తో ఢిల్లీ నాలుగు వికెట్ల నష్టానికి పూర్తి ఓవర్లలో 162 పరుగుల తో సరిపెట్టుకుంది.
క్రితం మ్యాచ్ లో అర్థ సెంచరీతో అదరగొట్టిన ఓపెనర్ డికాక్. తన ఫామ్ ఈ మ్యాచ్లో కూడా కొనసాగించాడు రోహిత్ శర్మ త్వరగానే వెనుదిరిగినప్పటికీ స్కోర్ వేగం ఎక్కడా తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. అతను అర్థ సెంచరీ పూర్తి చేసిన తర్వాత అశ్విన్ బౌలింగులో వెనుదిరిగాడు. ఇదేసమయంలో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్ కూడా పెవిలియన్ చేరాడు.
అయితే వీరిద్దరూ చాలా త్వరగా పరుగులు రాబట్టడంతో ముంబై కు ఉన్న బలమైన మిడిల్ ఆర్డర్ వల్ల చివర్లో ఎటువంటి ఇబ్బంది కలగలేదు. హార్దిక్ పాండ్యా డకౌట్ అయినప్పటికీ పొలార్డ్, పాండ్యా సాఫీగా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదన ను పూర్తి చేశారు.