క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాతీయ పండగ వచ్చేసింది. అయితే ఈసారి ఈ పండుగ భారతదేశంలో జరగడం లేదు. తటస్థ వేదిక దుబాయ్ లో ఎనిమిది జట్లు ఐపీఎల్ ట్రోఫీ కోసం పోటీ పడనున్నాయి. సెప్టెంబర్ 19న సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు అబుదాబిలో ముంబై ఇండియన్స్ -చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనున్న సంగ్రామంతో dream 11 ipl-2020 మొదలు కానుంది.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, కింగ్స్ XI పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అంటూ ఎనిమిది టీంలు కప్పు కోసం పోటీ పడనున్నాయి. ఇకపోతే దుబాయి, షార్జా, అబుదాబి — ఈ మూడు సిటీలు మొత్తం 46 లీగ్ మ్యాచ్ లకు, రెండు క్వాలిఫైయర్ లు ఒక ఎలిమినేటర్ ఒక ఫైనల్ మ్యాచ్ కు ఆతిధ్యం ఇవ్వనున్నాయి.
డిఫెండింగ్ చాంపియన్ ముంబై తొలి మ్యాచ్ లో టోర్నీ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొననుండడంతో రేటింగ్స్ తారా స్థాయిలో ఉంటాయని స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐపీఎల్ మొత్తం ‘స్టార్ స్పోర్ట్స్’ లో ఇంగ్లీష్, హిందీ లతో పాటు తెలుగులో కూడా ప్రసారం అవుతుంది. ఎప్పటిలాగే ఈ ఐపీఎల్ లో ఒక జట్టు మిగిలిన అన్ని జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడనుంది.
ఈ టోర్నీలో హాట్ ఫేవరేట్ గా ఏ జట్టూ బరిలోకి దిగడం లేదు అనే చెప్పాలి. అయితే ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ కెప్టెన్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మిగతా వాటితో పోలిస్తే అత్యధిక ఫాన్స్ ఉండటం గమనార్హం. ఏదేమైనా ఈ లాక్ డౌన్ వల్ల పూర్తిగా చప్పబడిపోయిన భారత క్రికెట్ అభిమానులందరికీ ఐపీఎల్ సరైన వినోదం అందిస్తుంది అని ఎలాంటి సందేహం లేదు.