పంది, గొడ్డు మాంసం కోసం ఏకంగా ఎంపీలే కొట్టుకున్నారు. అది కూడా పార్లమెంట్లో. ఎంపీలు తన్నులు, పోట్లాటలతో పార్లమెంటే రణస్థలంగా మారిపోయింది. ఒకరిపై ఒకరు తన్నులు, పిడిగుద్దులతో రెచ్చిపోయారు. పార్లమెంట్ అనేది దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక, ప్రజల సంక్షేమం కోసం పనిచేసే చోటైన చట్టసభలు అనే విషయాన్ని మరిచిపోయి ప్రజా ప్రతినిధులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఘటన తైవాన్ లో చోటుచేసుకుంది.
శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లో కెళ్తే.. తైవాన్ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆ దేశానికి దిగుమతి చేసుకుంటున్న పంది, గొడ్డు మాంసంపై చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతూ.. మాటల యుద్ధానికి తెరలేసింది. చిలికిచిలికి గాలివానలా చివరికి ఆ మాటల యుద్ధం ఘర్షణకు దారితీసింది.
ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు ఒకరిపై ఒకరు మాంసం ముద్దలతో దాడిచేసుకున్నారు. తన్నులు, పిడిగుద్దులతో రెచ్చిపోయారు. దీంతో ఒక్కసారిగా పార్లమెంట్ అనే విషయాన్ని మరిచిపోయిన ఎంపీలు ఆ ప్రాంతాన్ని రణరంగంగా మార్చారు. దీనికి ప్రధాన కారణం అమెరికాతో తైవాన్ చేసుకున్న మాంసం దిగుమతి ఒప్పందమే కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టులో పంది మాంసం దిగుమతిపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసిన దానికి సంబంధించిన వివరాలను ప్రీమియర్ సుసెంగ్ చాంగ్ పార్లమెంట్ సభ్యులకు వివరిస్తుండగా.. దానిని ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
కాగా, ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమెరికా నుంచి వచ్చే పంది మాంసం, గొడ్డు మాంసం దిగుమతులను వ్యతిరేకించారు. అయితే, ప్రస్తుతం దిగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించడం పట్ల ప్రతిపక్షాలతో పాటు అక్కడి ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ఆ దేశ రాజధాని తైపీలో భారీ నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు. అయితే, వాణిజ్య ఒప్పందంలో భాగంగానే మాంసం దిగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నామనీ, జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని తైవాన్ ప్రభుత్వం ప్రకటించింది.